గుజరాత్ మాజీ సీఎం ఆనందీ బెన్ సంచలన నిర్ణయం
సూరత్ : వయోభారం కారణంగా.. సీఎం పదవికి రాజీనామా చేస్తున్నానని ప్రకటించి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తిన ఆనందీ బెన్ పటేల్ తాజాగా మరో సంచల నిర్ణయం తీసుకున్నారు. తన తదనంతరం తన శరీరాన్ని అవయవ దానానికి వినియోగించాల్సిందిగా కోరారు. సూరత్ యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన ఓ ఎన్జీవో కార్యక్రమంలో ఆనందీ బెన్ ఈ మేరకు తన నిర్ణయాన్ని ప్రకటించారు.
కార్యక్రమంలో భాగంగా.. అవయవ దానం చేసిన కుటుంబాలను, ఇందుకోసం శ్రమిస్తోన్న వైద్యులను ఆనందీ భన్ సత్కరించారు. ఈ సందర్బంగా ఆనందీ బెన్ మాట్లాడుతూ.. 70 ఏళ్ల వయసు రాగానే ఇంటి పట్టునే ఉంటూ ప్రతీ ఒక్కరు విశ్రాంతి తీసుకోవడానికే మొగ్గు చూపుతారని, కానీ 85 ఏళ్ల కంటే వయసు పైబడిన డాక్టర్లు సైతం అవయవ మార్పిడి ఆపరేషన్లను విజయవంతంగా చేస్తున్నారని, వారి సేవలను కొనియాడారు.
శుక్రవారం నాడు సూరత్ తో పాటు నవసారిలో జరిగిన ఏపీఎంసీ, బర్డోలిలో జరిగిన వనమహోత్వవ్ లోను పాల్గొన్న ఆనందీ బెన్ తన రాజకీయాల గురించి మాత్రం ఎక్కడా ప్రస్తావించలేదు. వనమహోత్సవ్ లో భాగంగా.. ప్రజలంతా ఎక్కువ మొక్కలను నాటాలని ఆమె పిలుపునిచ్చారు.