ముఖేష్ అంబాని కుమారుడు అనంత్ కు ఆ పదవి ఇవ్వడంపై ఆంతర్యమేంటో?
డెహ్రాడూన్: దేవభూమి ఉత్తరాఖండ్ లో వెలసిన పరమ పవిత్ర పుణ్యక్షేత్రాలు బద్రీనాథ్, కేదార్ నాథ్ ఆలయాలు. శీతాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రస్తుతం మూతపడ్డ ఆ ఆలయాల తలుపులు ఈ ఏడాది మేలో తెరచుకోబోతున్నాయి. మే 9న కేదార్ నాథ్, 10న బద్రీనాథ్ ఆలయాల తలుపులు తెరవాలని ఆలయ కమిటీ ఇదివరకే నిర్ణయం తీసుకుంది. దీనితో- ఇక చార్ ధామ్ యాత్రకు దేశవ్యాప్తంగా సన్నాహాలు మొదవుతున్నాయి.
ముంబై మారణహోమ సూత్రధారికి ఐక్యరాజ్య సమితిలో ఎదురుదెబ్బ: పేరు తొలగింపునకు ససేమిరా
ప్రముఖ పారిశ్రామికవేత్త ముఖేష్ అంబాని కుటుంబం మే 9న కేదార్ నాథ్ ఆలయాన్ని సందర్శించనుంది. దీనికి సంబంధించిన షెడ్యూల్ ఖరారైనట్లు చెబుతున్నారు. కాగా, ముఖేష్ అంబాని కుమారుడు అనంత్ అంబాని.. బద్రినాథ్-కేదార్ నాథ్ ఆలయ కమిటీ సభ్యునిగా నియమితులయ్యారు. ఆయనను కమిటీ సభ్యునిగా నియమిస్తూ ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి త్రివేంద్ర సింగ్ రావత్ ఉత్తర్వులు జారీ చేశారు. మూడేళ్ల పాటు అనంత్ అంబాని ఆలయ కమిటీ సభ్యునిగా కొనసాగుతారు.
పారిశ్రామికవేత్తల దృష్టిని ఆకర్షించడానికేనా?
ప్రస్తుతం పారిశ్రామిక రంగానికి, వ్యాపార కార్యకలాపాలకు మాత్రమే పరిమితమైన అనంత్ అంబాని.. తొలిసారిగా అక్కడి నుంచి బాహ్య ప్రపంచంలోకి అడుగు పెట్టినట్టవుతుంది. ఆయనను బద్రీనాథ్-కేదార్ నాథ్ ఆలయ కమిటీ సభ్యునిగా నియమించడం వల్ల దేశవ్యాప్తంగా పారిశ్రామికవేత్తల దృష్టిని ఆకట్టుకుంటుందనే అభిప్రాయం వ్యక్తమౌతోంది. తిరుమల మినహాయిస్తే, బద్రినాథ్ లేదా కేదార్ నాథ్ ఆలయాలే కాకుండా దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ దేవస్థానాలను దర్శించుకునే పారిశ్రామికవేత్తల సంఖ్య కాస్త తక్కువే. ఈ పరిస్థితుల్లో వారి దృష్టిని ఆకట్టుకుంటే పారిశ్రామికవేత్తల తాకిడి పెరుగుతుందని, ఫలితంగా ఆలయానికి అదనపు ఆదాయం సమకూరుతుందని ఉత్తరాఖండ్ ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
టీటీడీ సభ్యత్వం కోసం నీతా అంబాని పేరు వినిపించినా..
ముఖేష్ అంబాని భార్య నీతా అంబానికి తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలిలో సభ్యత్వం కల్పించడాకి ఇదివరకు ప్రయత్నాలు చోటు చేసుకున్నాయి. అవి కార్యరూపం దాల్చలేదు. ప్రముఖ ఐటీ సంస్థ ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి భార్య సుధామూర్తి ప్రస్తుతం టీటీడీ బోర్డు సభ్యురాలిగా ఉన్నారు. నిజానికి- పారిశ్రామిక రంగం నుంచి సుధామూర్తికి బదులుగా నీతా అంబానిని టీటీడీ బోర్డులో సభ్యత్వం కల్పించాలని భావించారు. అనివార్య కారణాల వల్ల అది సాధ్యపడలేదు. నీతా అంబాని స్థానంలో సుధామూర్తిని నియమించారు.