ఎడతెగని హింస: అనంతనాగ్ ఉప ఎన్నిక వాయిదా
జమ్మూకాశ్మీర్లోని అనంతనాగ్ లోక్సభ నియోజకవర్గానికి బుధవారం జరగాల్సిన ఉప ఎన్నికను భారత ఎన్నికల కమిషన్ వాయిదా వేసింది. ఈ నియోజకవర్గ పరిధిలోని బద్గావ్, గండేర్బాల్ జిల్లాల్లో హింసాత్మక ఘటనలు.
శ్రీనగర్: జమ్మూకాశ్మీర్లోని అనంతనాగ్ లోక్సభ నియోజకవర్గానికి బుధవారం జరగాల్సిన ఉప ఎన్నికను భారత ఎన్నికల కమిషన్ వాయిదా వేసింది. ఈ నియోజకవర్గ పరిధిలోని బద్గావ్, గండేర్బాల్ జిల్లాల్లో హింసాత్మక ఘటనలు తలెత్తడంతో సోమవారం నిషేధాజ్ఞలు విధించడంతో పాటు ఉప ఎన్నికను మే 25వ తేదీకి వాయదా వేశారు.
ఈ ఉప ఎన్నికల కోసం ఏర్పాటు చేసిన రెండు పోలింగ్బూత్లకు ఆందోళకారులు నిప్పుపెట్టిన నేపథ్యంలో ఉద్రిక్తతలు కొనసాగుతునే ఉన్నాయి. పరిస్థితులు ఎక్కాడా అదుపులోకి రాలేదు. దీంతో నియోజకవర్గం నుంచి పిడిపి తరఫున పోటీ చేస్తున్న తస్సాదుఖ్ ముఫ్తీ ముఖ్యమంత్రి నివాసం వద్ద మీడియాతోమాట్లాడుతూ.. అనంతనాగ్ ఉప ఎన్నికను వాయిదా వేయాలని డిమాండ్ చేశారు.
'ఎన్నికల కమిషన్ను నేను కోరుతున్నది ఒకటే. సాధారణ పరిస్థితులు నెలకొనే వరకూ ఎన్నికలు జరపవద్దు. వాయిదా వేయండి'అని ఆయన అభ్యర్థించారు. ఎన్నికలను వాయిదా వేయని పక్షంలో పోటీ నుంచి తాను తప్పుకుంటానని పిడిపి నేత ప్రకటించారు. 'నేను పోటీ నుంచి తప్పుకుంటే పరిస్థితులు చక్కబడతాయని భావిస్తే, సంతోషంగా వైదొలుగుతాను'అని ఆయన స్పష్టం చేశారు.
తన అభ్యర్థను ఎన్నికల కమిషన్ పట్టించుకోకపోతే పోటీ నుంచి తప్పుకోడానికి తనకు ఎలాంటి అభ్యంతరం లేదని ముఫ్తీ అన్నారు. స్వేచ్ఛగా ఎన్నికలు నిర్వహించే సత్తా రాష్ట్ర ప్రభుత్వానికి లేదంటూ నేషనల్ కాన్ఫరెన్స్ చేసిన ఆరోపణలపై స్పందించడానికి ఈ పిడిపి నేత నిరాకరించారు. ఏడు శాతం కూడా ఓటింగ్ లేకపోవడానికి పిడిపి-బిజెపిపై ప్రజాగ్రహానికి కారణమా? అన్న ప్రశ్నను ఆయన తోసిపుచ్చారు. కాగా, ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ సోదరుడే ఈ తస్సాదుఖ్ ముఫ్తీ..
మరోపక్క ఉప ఎన్నికలనే నిర్వహించలేని ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ పదవికి రాజీనామా చేయాలని నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఒమర్ అబ్దుల్లా డిమాండ్ చేశారు. ఎన్నికలను వాయిదా వేయాలన్న పిడిపి అభ్యర్థి డిమాండ్ను ఆయన ఎద్దేవా చేశారు. మెహబూబా రాజీనామా చేసి గవర్నర్కు బాధ్యతలు అప్పగించాలని ఒమర్ సలహా ఇచ్చారు. శ్రీనగర్ లోక్సభ నియోకవర్గంలో పెల్లుబుకిన ఎన్నికల హింసలో ఇప్పటి వరకు 8 మంది మృతి చెందిన విషయం తెలిసిందే.
నగరంలో అదనపుబలగాలను మోహరించారు. 144 సెక్షన్ విధించారు. సోపియాన్ జిల్లా పద్దార్పొర ప్రాంతంలో ఓ పాఠశాల భవనానికి గుర్తుతెలియని వ్యక్తులు నిప్పుపెట్టారని సీనియర్ పోలీసు అధికారి ఒకరు వెల్లడించారు. పుల్వామా జిల్లా అరిహాల్ ప్రాంతంలోనూ స్కూల్ భవనానికి ఆదివారం రాత్రి నిప్పుపెట్టారని, ఇవి రెండూ పోలింగ్ స్టేషస్లేనని చెప్పారు.