ఆంధ్రాబ్యాంకుకు రూ.5వేల కోట్లు ఎగవేసి నైజీరియాలో తలదాచుకుంటున్న నితిన్ సందేశరా
ఢిల్లీ: మొన్న విజయ్ మాల్యా, నిన్న నీరవ్ మోడీ... నేడు నితిన్ సందేశర.. ఇలా రోజుకో పారిశ్రామికవేత్త బ్యాంకుల నుంచి భారీగా రుణాలు పొంది ఆపై అదే బ్యాంకులను బురిడీ కొట్టించి దేశాలు దాటేస్తున్నారు. తాజాగా గుజరాత్లోని స్టెర్లింగ్ బయోటెక్ యజమాని నితిన్ సందేశరా ఆంధ్రాబ్యాంకు నుంచి రూ.5వేల కోట్లు రుణం పొంది ఎగవేశారు. నితిన్ కోసం సీబీఐ ఈడీలు వేట ప్రారంభించాయి. ఈ క్రమంలోనే నితిన్ సందేశరా దుబాయ్లో అదుపులోకి తీసుకున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ వాస్తవానికి నితిన్ దుబాయ్లో లేడని మరో వార్త ప్రచారంలో ఉంది. ఆయన నైజీరియాకు పారిపోయి ఉంటారని తెలుస్తోంది.
సీబీఐ, ఈడీల నుంచి వచ్చిన విశ్వసనీయ సమాచారం మేరకు నితిన్ సందేశరా, అతని సోదరుడు చేతన్ సందేశరా, సోదరుని భార్య దీప్తిబెన్ సందేశరాలు నైజీరియాలో తలదాచుకున్నట్లు సమాచారం. అయితే నైజీరియా నుంచి ఒక వ్యక్తిని భారత్కు రప్పించడంపై ఆదేశంతో భారత్ ఎలాంటి ఒప్పందం కుదుర్చుకోలేదు. ఈ నేపథ్యంలోనే అక్కడి నుంచి సందేశరా కుటుంబాన్ని రప్పించడం కష్టమని తెలుస్తోంది. దుబాయ్లో నితిన్ సందేశరాను అరెస్టు చేసినట్లుగా వార్తలు ఆగష్టు రెండో వారంలో వచ్చాయని అయితే అందులో నిజం లేదని ఒక అధికారి తెలిపారు.
అంతకంటే ముందే నితిన్ అతని కుటుంబ సభ్యులు నైజీరియాకు పారిపోయినట్లు సమాచారం ఉందని ఆయన అన్నారు. ఒకవేళ సందేశరా దుబాయ్లో కనిపిస్తే అరెస్టు చేసి తమకు కబురు పంపాల్సిందిగా విచారణ సంస్థలు మాత్రం యూఏఈ అధికారులకు లేఖ రాశాయి. ఈ క్రమంలోనే నితిన్ సందేశరాపై రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేశారు అధికారులు. అయితే వారు నైజీరియా వెళ్లేందుకు భారతీయ పాస్పోర్టుపై వెళ్లారా లేక ఇతర దేశాల డాక్యుమెంట్లపై ప్రయాణించారా అనేదానిపై స్పష్టత లేదన్నారు అధికారులు.
సందేశరా కుటుంబం దాదాపు 300 షెల్ కంపెనీలను ఇటు భారత్లోను అటు విదేశాల్లోను ఏర్పాటు చేసినట్లు సీబీఐ గుర్తించింది. బ్యాలెన్స్ షీట్లను మానుపులేట్ చేసినట్లుగా విచారణ సంస్థ గుర్తించింది. ఈ కంపెనీలన్నిటినీ చూసుకునేందుకు డమ్మీ డైరెక్టర్లను నియమించారని సీబీఐ వెల్లడించింది. వీరంతా స్టెర్లింగ్ గ్రూపులో పనిచేస్తున్న ఉద్యోగులని పేర్కొంది. బినామీ కంపెనీలు స్టెర్లింగ్ కంపెనీల మధ్య బోగస్ సేల్స్ చూపించి తద్వారా బ్యాంకులనుంచి మరింత రుణం పొందారని సీబీఐ పసిగట్టింది.