తెలుగింటి ఆడపడుచుకు వ్యతిరేకంగా చంద్రబాబు ఎన్నికల ప్రచారం
బెంగళూరు: తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం కర్ణాటకలో పర్యటించనున్నారు. కాంగ్రెస్-జనతాదళ్ (సెక్యులర్) కూటమికి మద్దతుగా ఆయన పలు చోట్ల ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొనబోతున్నారు. దీనికి సంబంధించిన షెడ్యూల్ ఖరారైనట్లు తెలుస్తోంది. బెంగళూరు సహా తెలుగు ప్రజలు ఎక్కువగా నివసిస్తోన్న లోక్ సభ నియోజకవర్గాల పరిధిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో చంద్రబాబు పాల్గొంటారని సమాచారం. జేడీఎస్ చీఫ్, మాజీ ప్రధానమంత్రి దేవేగౌడ, ముఖ్యమంత్రి కుమారస్వామిలతో కలిసి రోడ్ షోలను నిర్వహిస్తారని అంటున్నారు. ముఖ్యమంత్రి కుమారుడు నిఖిల్ గౌడ పోటీ చేస్తోన్న మండ్యలో బహిరంగ సభలో చంద్రబాబు పాల్గొంటారని జేడీఎస్ వర్గాలు వెల్లడించాయి.
చంద్రబాబు ఎందుకిలా..సీయస్ తో సహా అందరూ కుమ్ముక్కేనా: ఏకాకి అవుతున్నారా..!
మండ్యలో సుమలత
తెలుగు వారికి పరిచయం అక్కర్లేని పేరు సుమలత. తెలుగింటి ఆడపడచు. గుంటూరు జిల్లాకు చెందిన సుమలత తెలుగులో అనేక సినిమాల్లో హీరోయిన్ గా నటించిన సుమలత.. కన్నడ స్టార్ నటుడు అంబరీష్ ను వివాహం చేసుకున్నారు. బెంగళూరులో స్థిరపడ్డారు. కాంగ్రెస్ పార్టీలో చాలాకాలం పాటు కొనసాగిన అంబరీష్ గత ఏడాది కన్నుమూసిన విషయం తెలిసిందే. గతంలో అంబరీష్ మండ్య నుంచి మూడుసార్లు లోక్ సభ కు ఎన్నికయ్యారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కేబినెట్ లో సహాయ మంత్రి హోదాలో పనిచేశారు. అంబరీష్ మరణానంతరం ఆయన కుటుంబానికి మండ్య లోక్ సభ టికెట్ ను ఇవ్వడానికి నిరాకరించింది కాంగ్రెస్ పార్టీ. పొత్తలో భాగంగా.. ఈ స్థానాన్ని జేడీఎస్ కు వదులుకుంది. జేడీఎస్ అభ్యర్థిగా తన కుమారుడు, నటుడు నిఖిల్ ను రంగంలోకి దింపారు కుమారస్వామి. దీనితో సుమలత స్వతంత్ర అభ్యర్థిగా మండ్య లోక్ సభ స్థానం నుంచి పోటీ చేయాల్సి వచ్చింది. భారతీయ జనతా పార్టీ ఆమెకు మద్దతు ఇస్తోంది. ఇందులో భాగంగా.. మండ్య లోక్ సభ స్థానానికి బీజేపీ అభ్యర్థిని నిలబెట్టలేదు.
తీవ్ర పోటీ..
బీజేపీ ఎన్నికల బరిలో లేకపోవడంతొో.. మండ్య లోక్ సభ స్థానంలో సుమలత, నిఖిల్ గౌడ మధ్యే ప్రధాన పోటీ నెలకొంది. నిఖిల్ ను గెలిపించడానికి ముఖ్యమంత్రి కుమారస్వామి తన సర్వశక్తులన్నీ ఒడ్డుతున్నారు. విస్తృతంగా పోటీ చేస్తున్నారు. మండ్య పరిధిలోని ప్రతి నియోజకవర్గంలోనూ ఆయన పర్యటిస్తున్నారు. మరో వంక- కన్నడ చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోలుగా గుర్తింపు ఉన్న యశ్ (కేజీఎఫ్ ఫేమ్), దర్శన్ వంటి నటులు సుమలతకు అండగా నిల్చున్నారు. సుమలత తరఫున వారిద్దరూ ప్రచారం చేస్తున్నారు. రోడ్ షోలను నిర్వహిస్తున్నారు. గెలుపు కోసం నిఖిల్ గౌడ, సుమలత హోరాహోరీగా తలపడుతున్నారు. నువ్వా? నేనా ? అనేలా తయారైంది అక్కడి పరిస్థితి. బీజేపీ క్యాడర్ కూడా సుమలత కోసం విస్తృతంగా ప్రచారం చేస్తుండటంతో పోటీ రసవత్తరంగా మారింది.
నిఖిల్ కోసం చంద్రబాబు..
నిఖిల్ గౌడకు మద్దతుగా చంద్రబాబు మండ్య లోక్ సభ పరిధిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొనబోతున్నారు. సోమవారం సాయంత్రం ఆయన మండ్యలో ఏర్పాటు చేసే బహిరంగ సభలో పాల్గొంటారని తెలుస్తోంది. దీనితోపాటు తెలుగు ఓటర్లు ఎక్కువగా స్థిరపడిన ప్రాంతాలైన బళ్లారి, బెంగళూరు నార్త్, చిక్ బళ్లాపుర, కోలార్ వంటి నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు కోసం చంద్రబాబు ప్రచారం చేసే అవకాశాలు లేకపోలేదని సమాచారం. ఈ క్రమంలో- సుమలత మండ్యలో పోటీ చేస్తున్నారనే విషయాన్ని చంద్రబాబు విస్మరిస్తున్నారని అంటున్నారు. బీజేపీ పోటీలో లేకపోయినప్పటికీ.. మండ్యలో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉన్న సుమలతకు వ్యతిరేకంగా చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం తప్పుడు సంకేతాలను పంపించినట్టవుతుందనే అభిప్రాయాలు అప్పుడే వ్యక్తమౌతున్నాయి కూడా.