అధికారంలోకి వస్తే ఏపీకి ప్రత్యేక హోదా, ఈరోజు మీవల్లే దుబాయ్ ఇలా ఉంది: రాహుల్ గాంధీ
దుబాయ్: 2019 లోకసభ ఎన్నికల్లో తాము అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ శుక్రవారం పునరుద్ఘాటించారు. ఆయన దుబాయ్లో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా భారతీయ కార్మికులను కలిశారు. ఈ సందర్భంగా మాట్లాడారు.
తాము అధికారంలోకి రాగానే మొదట చేసేపని ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడం అన్నారు. గత ఏడాది మార్చిలో హోదా కోసం ఏపీకి చెందిన నాయకులు జంతర్ మంతర్ వద్ద ధర్నా చేశారని, అయినా ప్రభుత్వం నుంచి స్పందన లేదని చెప్పారు.
రాష్ట్రం విడిపోయాక నవ్యాంధ్రప్రదేశ్కు కచ్చితంగా ఇవ్వాల్సిన ముఖ్య హామీని ప్రధాని నరేంద్ర మోడీ మరిచిపోయారని ఎద్దేవా చేశారు. ఏపీకి ఇవ్వాల్సిన రుణం గురించి మనమంతా భారత ప్రభుత్వానికి, మోడీకి అర్థమయ్యేలా చెప్పాలన్నారు.
Congress President @RahulGandhi was greeted with loud cheers & an abundance of love & admiration at his address to the labour community in Dubai.#RahulGandhiInUAEhttps://t.co/U81GFhwKnc
— Congress (@INCIndia) January 11, 2019
దుబాయ్ అభివృద్ధిలో భారత కార్మికుల పాత్ర ఎంతో ఉందని చెప్పారు. ఇక్కడి ఎత్తయిన భవనాలు, మెట్రో స్టేషన్లు, విమానాశ్రయాలు.. ఇలా ఎన్నో మీ శ్రమ, చెమటతో నిర్మించబడ్డాయని చెప్పారు. మీరు లేకుంటే ఇది సాధ్యమయ్యేది కాదన్నారు. భారత కార్మికుల వల్లే ఈ రోజు దుబాయ్ ప్రపంచంలోనే ప్రత్యేక నగరంగా ఉందన్నారు. నా 'మన్ కీ బాత్'ను ఇక్కడ మాట్లాడలేనని ప్రధాని మోడీని ఉద్దేశించి ఎద్దేవా చేశారు.