ఆంధ్ర టు బెంగళూరు: చైనా, జపాన్లకు ఎర్ర చందనం
బెంగళూరు: బెంగళూరు నగరంలో భారీ ఎత్తున ఎర్ర చందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బెంగళూరు-మైసూరు రోడ్డులోని బ్యాటరాయణపురలోని స్యాటిలైట్ బస్ స్టాండ్ వెనుక ఉన్న గొదాము మీద దాడి చేసిన బెంగళూరు సీసీబీ పోలీసులు రూ. 30 లక్షల విలువైన ఎర్ర చందనం దుంగులను స్వాధీనం చేసుకున్నారు.
బ్యాటరాయణపుర నివాసి ఎం. వరుణ్ కుమార్ (32) అనే వ్యక్తిని అరెస్టు చేశామని పోలీసులు చెప్పారు. ఇదే కేసులో రమేష్ అనే స్మగ్లర్ తప్పించుకున్నాడని పోలీసులు అన్నారు. వరుణ్ కుమార్ సులభంగా నగదు సంపాదించాలని ప్లాన్ వేశాడు.
అందుకు స్మగ్లర్ రమేష్తో చేతులు కలిపాడు. ఆంధ్రప్రదేశ్ నుండి ఎర్రచందనం దుంగలను బెంగళూరు తీసుకు వచ్చి టింబర్ లేఔట్ లోని కృష్ణ నెయ్యి గొదాములో నిల్వ చేశారు. తరువాత గుట్టు చప్పుడు కాకుండ చైనా, జపాన్ దేశాలకు ఎర్ర చందనం దుంగలు తరలిస్తున్నారు.
ఈ విషయంపై బెంగళూరు సీసీబీ పోలీసులకు కచ్చితమైన వివరాలు అందాయి. నిందితుల మీద నిఘా వేశారు. వీరు పైకి నెయ్యి వ్యాపారం చేస్తున్నట్లు నటిస్తూ ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తున్నారని కచ్చితమైన ఆధారాలు సేకరించి అరెస్టు చేశారు. పరారైన రమేష్ కోసం గాలిస్తున్నామని క్రైం బ్రాంచ్ పోలీసులు తెలిపారు.