ఎర్త్ ఇమేజింగ్ అండ్ మ్యాపింగ్ శాటిలైట్: ఉగ్ర కదలికలపై ఉపగ్రహ నిఘా
Recommended Video
నెల్లూరు: దేశంలో తరచూ ప్రాణాంతక దాడులు చేస్తూ, మారణ హోమానికి తెగబడుతోన్న ఉగ్రవాదులపై నిఘా వ్యవస్థ మరింత బలోపేతమైంది. ఉగ్రవాదుల కదలికలు, వారి శిబిరాలను అత్యంత స్పష్టంగా ఫొటోలు తీయడానికి కూడా వినియోగించేలా రూపొందించిన కార్టోశాట్-3ని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) శాస్త్రవేత్తలు విజయవంతంగా అంతరిక్షంలోకి ప్రయోగించారు. బుధవారం ఉదయం సరిగ్గా 9:28 నిమిషాలకు నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధవన్ అంతరిక్ష కేంద్రం నుంచి దీన్ని ప్రయోగించారు.
గవర్నర్ తో ఉద్ధవ్ దంపతుల భేటీ: ప్రమాణానికి సోనియా గాంధీ: శివాజీ పార్కులో..పాతిక వేల మంది సమక్షంలో
గ్రాండ్ సక్సెస్..
కార్టోశాట్-3 సహా 13 కమర్షియల్ నానో ఉపగ్రహాలను అంతరిక్షంలోకి విజయవంతంగా మోసుకెళ్లింది పోలార్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ (పీఎస్ఎల్వీ) సీ-47. సతీష్ ధవన్ అంతరిక్ష కేంద్రం నుంచి ప్రయోగించిన 74వ ప్రాజెక్టు ఇది. ఈ ప్రయోగం విజయవంతమైనట్లు ఇస్రో ఛైర్మన్ కే శివన్ వెల్లడించారు. పీఎస్ఎల్వీని ప్రయోగించిన తరువాత నిర్దేశిత మార్గంలోనే అది ప్రయాణించిందని, విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశ పెట్టగలిగామని అన్నారు.
హైరిజల్యూషన్ తో ఎర్త్ మ్యాపింగ్..
హై రిజల్యూషన్ గల సివిలియన్ శాటిలైట్.. కార్టోశాట్-3. ఎర్త్ ఇమేజింగ్ అండ్ మ్యాపింగ్ సాంకేతిక పరిజ్ఞానాన్ని కలిగి ఉండటం దీని ప్రత్యేకత. అత్యంత స్పష్టంగా భూమిపై గుర్తించిన ప్రదేశాలు, ప్రాంతాల ఫొటోలను తీసే హైరిజల్యూషన్ కెమెరాలను దీనికి అమర్చారు. మనదేశ సైనిక, నౌకదళం, వాయుసేనలు సైతం దీని సేవలను వినియోగించుకోవడానికి అవకాశం ఉంది. దీనివల్ల ఉగ్రవాదులు, అసాంఘిక శక్తుల కదలికలను ఇదివరకటి కంటే కూడా స్పష్టంగా చూసే వెసలుబాటు లభించినట్టయింది.
ఉగ్రవాదుల కార్యకలాపాలపై నిఘా
హైరిజల్యూషన్ తో ఫొటోలను తీయడం వల్ల ఉగ్రవాదుల శిబిరాలు గానీ, వారి కార్యకలాపాలపై గానీ నిఘాను మరింత బలోపేతం చేయడానికి కార్టోశాట్-3 సేవలు ఉపయోగపడతాయని అంటున్నారు. కార్టోశాట్-3 ఎర్త్ ఇమేజింగ్ అండ్ మ్యాపింగ్ శాటిలైట్ కావడం వల్ల ఉగ్రవాదుల శిబిరాలను గుర్తించడానికి అవకాశం లభించినట్టయిందని చెబుతున్నారు. భూమి, సముద్ర మార్గాల గుండా సరిహద్దులను దాటుకుని భారత భూభాగంపైకి చొరబడటానికి ఉగ్రవాదులు చేసే ప్రయత్నాలను ముందుగానే పసిగట్టొచ్చని తెలుస్తోంది.
ఆనందంగా ఉందంట..
పీఎస్ఎల్వీ-సీ 47 కార్టోశాట్-3 ప్రయోగం విజయవంతం కావడం వల్ల ఇస్రో ఛైర్మన్ కే శివన్ ఆనందాన్ని వ్యక్తం చేశారు. శాస్త్రవేత్తలు సమష్టి కృషి ఫలితంగా ఇది సాధ్యపడిందని అన్నారు. మున్ముందు ఇదే తరహా ప్రయోగాలను నిర్వహించడానికి శ్రీకారం పలికిందని చెప్పారు. ఇప్పటిదాకా హైరిజల్యూషన్ సివిలియన్ శాటిలైట్లను ప్రయోగించలేదని, ఈ ప్రయోగంతో ఆ లోటు తీరిందని అన్నారు. త్వరలోనే మరిన్ని భారీ ప్రాజెక్టులను చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఒకేసారి ఏడు ఉపగ్రహాలను అంతరిక్షంలోకి ప్రయోగించడానికి ప్రణాళికలను రూపొందిస్తున్నట్లు తెలిపారు.