ప్రభుత్వానికి కాంగ్రెసు వెనక్కి: రాష్ట్రపతి పాలనే?
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే ఆలోచన నుంచి కాంగ్రెసు అధిష్టానం వెనక్కి తగ్గినట్లు కనిపిస్తోంది. సకాలంలోనే రాష్ట్ర శాసనసభకు ఎన్నికలు జరుగుతాయని ఎన్నికల కమిషన్ తేల్చి చెప్పడంతో ప్రభుత్వ ఏర్పాటు ఆలోచనను కాంగ్రెసు అధిష్టానం విరమించుకున్నట్లు తెలుస్తోంది. శాసనసభ ఎన్నికలను ఆరు నెలల పాటు వాయిదా వేయించి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే ఆలోచనతో కాంగ్రెసు అధిష్టానం ముందుకు వచ్చింది.
లోకసభ ఎన్నికలతో పాటు రాష్ట్ర శాసనసభ ఎన్నికలు జరుగుతాయని, విభజన ప్రక్రియను ఎన్నికల తర్వాత పూర్తి చేసుకునే అవకాశం కూడా ఉందని ఎన్నికల కమిషన్ తేల్చి చెప్పింది. మేలో కేంద్ర ప్రభుత్వం ఏర్పడాల్సి ఉంది. దీంతో త్వరలో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది.
కాంగ్రెసు ప్రభుత్వ ఏర్పాటుకు వెనక్కి తగ్గడంతో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతి పాలన విధించే దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. రేపు గానీ, ఎల్లుండి గానీ కేంద్ర మంత్రి వర్గ సమావేశంలో రాష్ట్రపతి పాలన విధింపుపై నిర్ణయం తీసుకునే అవకాశాలున్నట్లు చెబుతున్నారు.
ఇదిలావుంటే, కేంద్ర హోం శాఖ కార్యదర్శితో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతి సమావేశమయ్యారు. విభజన ప్రక్రియను పూర్తి చేయడానికి కనీసం మూడు నెలలు పడుతుందని మహంతి తేల్చి చెప్పినట్లు సమాచారం. దీంతో ఉమ్మడి రాష్ట్రంలోనే ఎన్నికలు జరుగుతాయని భావిస్తున్నారు.