జగన్, కేసీఆర్కు మోదీ ఫోన్ కాల్ - కేంద్రం సహాయానికి హామీ - రాష్ట్రపతి కోవింద్ కీలక సందేశం
భారీ వర్షాలు, వరదల ధాటికి చగురుటాకులా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలకు యావత్ దేశం అండగా ఉంటుందని రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ అన్నారు. ఏపీ, తెలంగాణకు కేంద్రం ప్రభుత్వం అవసరమైన సహాయం చేస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ భరోసా ఇచ్చారు. వాయుగుండం కారణంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో గత రెండు రోజులుగా ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తుండటం, వరద పోటెత్తడంతో వ్యవస్థలు కుప్పకూలడం, రెండు రాష్ట్రాల్లో కలిపి సుమారు 30 మంది ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో ఇక్కడి పరిస్థితులపై రాష్ట్రపతి, ప్రధని ఆరా తీశారు.
హైదరాబాద్లో అంధకారం - కరెంటు ఉన్నా ఇవ్వలేమన్న ట్రాన్స్కో - వరద తగ్గేదాకా ఇంతేనా?
ప్రధాని ఏమన్నారంటే..
తెలంగాణ, ఏపీ ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్ లతో ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం రాత్రి ఫోన్లో మాట్లాడారు. ఈ విపత్కర సమయంలో అవసరమైన సహాయం అందించడానికి కేంద్రం సిద్ధంగా ఉందని మోదీ భరోసా ఇచ్చారు. వరదల కారణంగా చనిపోయినవారి కుటుంబాలకు ప్రధాని సానుభూతి వ్యక్తం చేశారు. ‘‘భారీ వర్షపాతం కారణంగా తెలంగాణ, ఏపీలో నెలకొన్న పరిస్థితులపై ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్ లతో మాట్లాడాను. రెస్క్యూ & రిలీఫ్ పనులకు సంబంధించి కేంద్రం నుంచి సాధ్యమైనంత స్థాయిలో సహాయాన్ని అందిస్తామని హామీ ఇచ్చాను. భారీ వర్షాల కారణంగా చనిపోయినవారు, ముంపునకు గురైన కుటుంబాలకు సానుభూతి తెలుపుతున్నాను'' అని మోదీ ట్వీట్ చేశారు. మరోవైపు..
దేశమంతా మీ వెంటే..
ఏపీ తెలంగాణలు ప్రస్తుతం విపత్కర పరిస్థితులను ఎదుర్కొంటున్నాయని, భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలం అవుతున్నాయని, ఈ కష్టకాలంలో తెలుగు రాష్ట్రాలకు దేశమంతా అండగా నిలుస్తున్నదని రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తన సందేశంలో అన్నారు. ‘‘హైదరాబాద్ సహా తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాల వల్ల జరిగిన విధ్వంసం, ప్రాణ నష్టం గురించి గవర్నర్ తమిళిసై, సీఎం కేసీఆర్ తో మాట్లాడాను. ఈ సంక్షోభ సమయంలో దేశం మొత్తం తెలంగాణ ప్రజలకు తోడుగా ఉంటుంది'' అని రాష్ట్రపతి తెలుగులో ట్వీట్ చేశారు.
పెరుగుతోన్న మరణాలు..
గడిచిన రెండు రోజులుగా కుండపోత వర్షం, భారీగా వదర పోటెత్తడంతో తెలుగు రాష్ట్రాలు విలవిలలాడాయి. తెలంగాణ రాజధాని హైదరాబాద్ సహా, నాగర్ కర్నూలు జిల్లాలో ఇళ్లు కూలిన సంఘనల్లో 17 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆంధ్రప్రదేశ్లోని వివిధ జిల్లాల్లో కలిపి మొత్తం 10 మంది మరణించినట్లు బుధవారం నాటి సమీక్షలో సీఎం వెల్లడించారు. హైదరాబాద్ నగరంలో మంగళవారం రాత్రి గల్లంతైన పలువురు వ్యక్తుల ఆచూకీ ఇంకా లభించకపోవడంతో మరణాల సంఖ్య పెరిగే అవకాశముంది.
Recommended Video
వర్షాలు: సీఎం జగన్ ప్రయారిటీ దీనికే - తెలంగాణ ఎఫెక్ట్ - చిత్తూరులో విచిత్ర పరిస్థితి - కీలక ఆదేశాలు