1500 జియో టవర్ల డ్యామేజీ: వద్దంటే వినరా? అంటూ రైతులకు పంజాబ్ సీఎం హెచ్చరికలు
ఛండీగఢ్: కేంద్రం తెచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తున్న పంజాబ్ రైతులు ఆ రాష్ట్రంలోని 1500 రిలియన్స్ జియో టెలికాం టవర్లను డ్యామేజీ చేశారు. టెలికాం టవర్లకు విద్యుత్ను నిలిపివేయడం, ధ్వంసం చేయడం, జనరేటర్లను దొంగలించడం లాంటి చర్యలతో రైతులు రెచ్చిపోతున్నారు. ఈ నేపథ్యంలో పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ విధ్వంసానికి పాల్పడే రైతులకు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.
కఠిన చర్యలు తీసుకోవాలంటూ ఆదేశాలు
టెలికాం సర్వీసులకు విఘాతం కలిగించేలా రైతులు వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు సీఎం అమరీందర్ సింగ్ ఆదేశాలు ఇచ్చారు. గత వారం రోజులుగా ముకేష్ అంబానీకి చెందిన జియో టెలికాం టవర్లను ధ్వంసం చేసే పనిలో పడ్డారు కొందరు రైతులు. నూతన వ్యవసాయ చట్టాలతో అంబానీకే లాభమని ఆరోపిస్తూ ఈ చర్యలకు దిగుతున్నారు.
రైతుల విధ్వంసం..
జలంధర్లో జియోకు సంబంధించిన ఫైబర్ కేబుళ్లను దగ్ధం చేశారు. అంతేగాక, జియో ఉద్యోగులను బెదిరింపులకు గురిచేస్తున్నారు. కొన్ని చోట్ల జియో సిబ్బందిపై దాడులు చేయడం గమనార్హం. అయితే, ఇప్పటి వరకు రైతులు చేస్తున్న ఈ చర్యలపై పోలీసులు ఎలాంటి కేసులు పెట్టలేదు. చర్యలు కూడా తీసుకోలేదు.
విద్వంసానికి దిగితే ఊరుకోం..
జియో టెలికాం సర్వీసులకు విఘాతం కలగడంతో రాష్ట్రంలోని అనేక వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ క్రమంలో సీఎం అమరీందర్ సింగ్ తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. ప్రైవేటు, పబ్లిక్ ఆస్తులను ధ్వంసం చేస్తే ఊరుకునేది లేదని, కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నిరసనలు శాంతియుతంగా చేసుకోవాలని, విధ్వంసానికి పాల్పడవద్దని తేల్చి చెప్పారు.
Recommended Video
రైతుల చర్యలతో.. ప్రజలకు తప్పని తిప్పలు..
మొబైల్ టవర్ల విధ్వంసం కారణంగా.. సిగ్నల్స్లో అంతరాయం కలిగి ఆన్లైన్ క్లాసులు వింటున్న విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అంతేగాక, కరోనా కారణంగా ఇంటి నుంచే పనులు చేస్తున్న ఉద్యోగులకు కూడా ఇబ్బందులు తప్పడం లేదు. దీంతో ప్రభుత్వానికి ప్రజల నుంచి ఫిర్యాదులు ఎక్కువ కావడంతో ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ ఈ మేరకు స్పందించారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై కూడా ఈ చర్యలు ప్రభావం చూపుతాయని సీఎం ఆందోళన వ్యక్తం చేశారు. ఓ వైపు ప్రజలు, మరోవైపు టెలికాం సంస్థలు కూడా ప్రభుత్వాన్ని మొబైల్ సేవలకు అంతరాయం కలిగించకుండా చూడాలని విన్నవించాయి. కాగా, నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ గత నెల రోజులకుపైగా ఢిల్లీ సరిహద్దులోని జాతీయ రహదారులపై పంజాబ్, హర్యానా రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. పలుమార్లు ప్రభుత్వం చర్చలు జరిపినా సఫలం కాలేదు. డిసెంబర్ 30న మరోసారి చర్చలు జరపనున్నారు.