హర్భజన్ మొదలు సీఎం అమరీందర్ వరకూ.. భగ్గుమన్న సిక్కులు... కోల్కతా నిరసనలో ఘోర అవమానం...
పశ్చిమ బెంగాల్లో బీజేపీ నేతల హత్యలను నిరసిస్తూ ఆ పార్టీ చేపట్టిన 'ఛలో నబన్నా' ఆందోళన తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. నిరసనకారులను అడ్డుకునే క్రమంలో పోలీసులు వ్యవహరించిన తీరు మమతా సర్కార్ను వివాదంలోకి నెట్టింది. నిరసనలో పాల్గొన్న ఓ సిక్కు సోదరుడి 'టర్బన్'(తలపాగా)ను ఓ పోలీస్ అధికారి లాగేయడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. క్రికెటర్ హర్భజన్ సింగ్ మొదలు పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ వరకు ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు. సిక్కు ఆత్మ గౌరవానికి భంగం కలిగించేలా వ్యవహరించిన ఈ ఘటనపై విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు.
ఛలో నబన్నా... ఉద్రిక్తతలు,ఘర్షణ...
ఇటీవల పశ్చిమ బెంగాల్ బీజేపీ నేత మనీష్ శుక్లాపై గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపి హతమార్చారు. గతంలోనూ రాష్ట్రంలో పలువురు బీజేపీ కార్యకర్తలు హత్యలకు గురవడంతో ఆ పార్టీ తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతోంది. ఈ హత్యల వెనుక అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఉందని ఆరోపిస్తున్న బీజేపీ.. ఈ క్రమంలో శుక్రవారం(అక్టోబర్ 9) సచివాలయ ముట్టడికి 'ఛలో నబన్నా' ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టింది. ఆందోళనను అడ్డుకునేందుకు పోలీసులు రంగంలోకి దిగడంతో తీవ్ర ఘర్షణ చెలరేగింది. 43 ఏళ్ల బల్వీందర్ సింగ్ అనే వ్యక్తి 'టర్బన్'ను ఓ పోలీస్ అధికారి లాగి పడేశాడు. దీనికి సంబంధించిన ఫోటోలు,వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
భగ్గుమంటున్న సిక్కులు...
'టర్బన్'ను లాగి పడేసి సిక్కుల మత విశ్వాసాల పట్ల అనుచితంగా వ్యవహరించిన సదరు పోలీస్ అధికారిపై సిక్కు వర్గం నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సిక్కుల మతపరమైన మనోభావాలను దెబ్బతీసిన సదరు పోలీస్ అధికారిపై చర్యలు తీసుకోవాలని బెంగాల్ సీఎం మమతా బెనర్జీని కోరారు. శిరోమణి అకాళీదళ్ చీఫ్ సుఖ్బీర్ సింగ్ బాదల్ కూడా ఈ చర్యను ఖండించారు. ఈ దుర్మార్గపు దాడిని తీవ్రంగా ఖండిస్తున్నానని... ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న సిక్కులను ఆగ్రహావేశాలకు గురిచేసిందని పేర్కొన్నారు. ఈ ఘటనపై చర్యలు తీసుకోవాల్సిందిగా క్రికెటర్ హర్భజన్ సింగ్ ట్విట్టర్ ద్వారా మమతా బెనర్జీకి విజ్ఞప్తి చేశారు.
తోసిపుచ్చిన పోలీసులు...
మరోవైపు బెంగాల్ పోలీసులు మాత్రం తమపై వస్తున్న ఆరోపణలను తోసిపుచ్చారు. బల్వీందర్ సింగ్ టర్బన్ను తాము తొలగించలేదని... ఘర్షణ క్రమంలో దానికదే ఊడిపోయిందని అన్నారు. మత విశ్వాసాలను,మనోభావాలను దెబ్బతీయడం తమ ఉద్దేశం కాదన్నారు. సింగ్ వద్ద నుంచి పోలీసులు 9 ఎంఎం గన్ను కూడా స్వాధీనం చేసుకున్నారు. లైసెన్స్ లేకుండా గన్ వాడుతున్నందుకు అతనిపై భారతీయ ఆయుధ చట్టం ప్రకారం కేసు నమోదు చేశారు. రాష్ట్రీయ రైఫిల్స్ రాజౌరికి చెందిన మాజీ సైనికుడిగా అతన్ని గుర్తించారు. అయితే బీజేపీ బెంగాల్ చీఫ్ దిలీప్ ఘోష్ మాత్రం బల్వీందర్ సింగ్ ఓ బీజేపీ నేత వద్ద సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నట్లు చెప్పడం గమనార్హం.
భిన్న వాదనలు...
తృణమూల్ కాంగ్రెస్ నేత ఫిర్హద్ హకీం మాట్లాడుతూ... 'పొలిటికల్ ర్యాలీల్లో బాంబులు,గన్స్ ఉపయోగించడం మేమెప్పుడూ చూడలేదు. మీరు ర్యాలీల్లో గన్స్ వాడినప్పుడు పోలీసులు తమ పని తాము చేయాల్సిందే...' అని పేర్కొన్నారు. మరోవైపు బీజేపీ నేతలు 'జస్టిస్ ఫర్ బల్వీందర్ సింగ్' అని నినదిస్తున్నారు. అతని పట్ల అనుచితంగా వ్యవహరించిన పోలీస్పై చర్యలు తీసుకోవాలని బీజేపీ బెంగాల్ ఇన్చార్జి కైలాష్ విజయ్ వర్గియా డిమాండ్ చేశారు.