నువ్వు హీరోవా?: మాల్యాకి కింగ్ఫిషర్ ఉద్యోగుల లేఖ
ముంబై: ఉద్యోగులకు చాలాకాలంగా వేతనాలు చెల్లించకుండా, ఇప్పుడు దేశం విడిచి వెళ్లేందుకు సిద్ధమవుతున్న కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ యజమాని విజయ్ మాల్యాకు ఆ సంస్థ ఉద్యోగులు శనివారం నాడు ఘాటైన బహిరంగ లేఖ రాశారు. తమ రక్తంతో ఆయన చేతులు తడుపుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇప్పటికి కూడా ఆయన మనసు మారలేదన్నారు. నీ వైఖరితో మేము ఇంకా బాధలు పడుతున్నామని, కింగ్ ఫిషర్ ఎయిర్ వేస్ ఇంకా ఉందని, పే రోల్స్లో మా పేర్లు ఉన్నాయని, ఎటొచ్చీ మాకు వేతనాలే ఇవ్వడం లేదని, మీ నుంచి ఏనాడూ మాకు సమాచారం లేదని, సంస్థను మూసేయలేదని పేర్కొన్నారు.
తిరిగి విమానాలు నడుపుతామని చెప్పిన హామీని నెరవేర్చే దిశగా ఒక్క అడుగు కూడా మీరు వేయలేదన్నారు. కంపెనీ షట్ డౌన్ తో తీవ్ర ఇబ్బందులు పడ్డామని, తమకు బకాయి పడ్డ వేతనాలు ఇచ్చేందుకు డబ్బు లేదన్నారు... కానీ కరేబియన్ ప్రీమియర్ లీగ్, లగ్జరీ యాచ్ ఎక్కడి నుంచి వచ్చాయని నిలదీశారు.
ఉద్యోగుల రక్తంతో కులుకుతున్నాడని ఆరోపించారు. తన వ్యవహారంతో మాల్యా దేశానికి చెడ్డ పేరు తెచ్చారని, భారత విమానయాన రంగంపై నమ్మకం పోయేలా చేశారన్నారు. నీ వల్ల మేం నరకం అనుభవిస్తున్నామని పేర్కొన్నారు. నీ వల్ల విమానయాన పరిశ్రమ, దేశం తన ప్రతిష్ఠను కోల్పోయింది. బెయిల్ పైన బయట ఉన్న నీవు హీరోవా, దయచేసి ఇప్పటికైనా పశ్చాత్తాపపడు అని రాశారు.