బీహార్ సీఎంకు చేదు అనుభవం.. నితీశ్ గో బ్యాక్ నినాదాలు చేసిన రోగుల బంధువులు..
ముజఫర్పూర్ : బీహార్లో మెదడువాపు లక్షణాలతో మృతి చెందిన చిన్నారుల సంఖ్య వంద దాటింది. అయినా ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోవడంలేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో పరిస్థితిని సమీక్షించేందుకు బీహార్ సీఎం నితీశ్ కుమార్ ముజఫర్పూర్లోని శ్రీ కృష్ణ మెడికల్ కాలేజ్ హాస్పిటల్కు వెళ్లారు. అక్కడ ఆయనకు చేదు అనుభవం ఎదురైంది. నితీశ్ను అడ్డుకున్న కొందరు బాధిత చిన్నారుల బంధులు ఆయనను వెనక్కి వెళ్లమని నినాదాలు చేశారు. దీంతో కాసేపు అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
పిల్లల్ని అలా చూపిస్తే ఊరుకోం.. ప్రైవేట్ టీవీ ఛానళ్లకు స్ట్రాంగ్ వార్నింగ్..
బాధితుల నినాదాల మధ్యన సీఎం నితీశ్ కుమార్ డాక్టర్లతో మాట్లాడారు. ప్రస్తుత పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. మెదడువాపు వ్యాధి ప్రబలకుండా తీసుకోవాల్సిన చర్యల గురించి నితీశ్ డాక్టర్లతో చర్చించారు. వ్యాధిపై అవగాహన లేకపోవడంతో ఎలాంటి చికిత్స అందించాలో తెలియకపోవడం వల్లే మృతుల సంఖ్య పెరిగిందని ఆయన అంగీకరించారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పారు.
ఇదిలా ఉంటే బీహార్లో మెదడువాపుతో చిన్నారుల మరణించడంపై నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ స్పందించింది. దీనిపై వివరణ ఇవ్వాలంటూ కేంద్ర ఆరోగ్యశాఖతో పాటు బీహార్ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. వ్యాక్సినేషన్తో పాటు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోని కారణంగానే ఇలాంటి పరిస్థితి తలెత్తిందని ఎన్హెచ్ఆర్సీ అభిప్రాయపడింది. అమాయకులైన చిన్నారుల భవిష్యత్ను ప్రమాదంలో పడేయడం మానవ హక్కుల ఉల్లంఘన కిందకే వస్తుందని విమర్శించింది.
ఎన్హెచ్ఆర్సీ నోటీసుల నేపథ్యంలో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్థన్ ఢిల్లీలోని ఎయిమ్స్, ఐసీఎంఆర్కు చెందిన ఉన్నతాధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. పిల్లల మరణాలపై క్షేత్రస్థాయి పరిశీలన జరిపేందుకు అత్యున్నత స్థాయి బృందాన్ని ముజఫర్పూర్కు పంపించాలని ఆదేశించారు.