రైతులు హైవేని ఖాళీ చేసి వెళ్లిపోవాలి... ఢిల్లీ సింఘు బోర్డర్లో తిరగబడుతున్న స్థానికులు...
దేశ రాజధాని ఢిల్లీలోని సింఘు బోర్డర్ వద్ద ఆందోళన చేస్తున్న రైతులు వెంటనే హైవేని ఖాళీ చేసి వెళ్లిపోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు గురువారం(జనవరి 29) జాతీయ జెండాలను చేతపట్టుకుని రోడ్డెక్కారు. 'సింఘు బోర్డర్ను ఖాళీ చేయండి..' అంటూ రైతులను ఉద్దేశించి నినాదాలు చేశారు. స్థానికుల నిరసనతో సింఘు బోర్డర్ వద్ద ఒకింత టెన్షన్ వాతావరణం నెలకొన్నది.
దాదాపు రెండు నెలలకు పైగా కొనసాగుతున్న రైతు ఆందోళనలతో తన వ్యాపారం బాగా దెబ్బతిన్నదని నిరసనలో పాల్గొన్న స్థానికుడు ఒకరు తెలిపారు. మరో వ్యక్తి మాట్లాడుతూ.. రిపబ్లిక్ డే సందర్భంగా ఎర్రకోటపై నిషాన్ సాహిబ్ జెండా ఎగరవేయడాన్ని తప్పు పట్టారు. అది జాతీయ జెండాను అవమానించడమేనని... ఆ చర్యను వ్యతిరేకిస్తూ నిరసనకు దిగామని చెప్పారు.
కాగా,రిపబ్లిక్ డే సందర్భంగా రైతులు చేపట్టిన ట్రాక్టర్ ర్యాలీ హింసాత్మకంగా మారిన సంగతి తెలిసిందే. నిర్దేశించిన మార్గాల్లో కాకుండా రైతులు సెంట్రల్ ఢిల్లీలోకి ట్రాక్టర్లతో దూసుకెళ్లడంతో.. చాలాచోట్ల పోలీసులకు,వారికి మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఒకచోట ట్రాక్టర్ బోల్తా కొట్టి ఒక రైతు మరణించారు. ఇదే క్రమంలో రైతులు ఎర్రకోట వైపు కదిలి.. పోలీసు నిర్భంధాన్ని చేధించుకుని అక్కడి స్తంభంపై తమ జెండాను ఎగరవేశారు.
రెండు నెలలుగా శాంతియుత వాతావరణంలో సాగిన రైతుల ఆందోళనలు ఒక్కసారిగా హింసాత్మకంగా మారడం ఢిల్లీలో అలజడి రేపింది. అయితే రైతులు మాత్రం ఈ హింసకు బయటి నుంచి వచ్చిన శక్తులే కారణమని ఆరోపిస్తున్నారు. రైతు ఉద్యమాన్ని అణచివేసేందుకు కుట్ర జరిగిందని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే పంజాబ్ నటుడు,సింగర్ దీప్ సిధు పేరు కూడా తెర పైకి వచ్చింది. ఎర్రకోట ముట్టడికి దీప్ సిధునే కారణమని... రైతుల భావోద్వేగాలను రెచ్చగొట్టి హింసకు కారణమయ్యాడని రైతు సంఘాలు కూడా ఆరోపిస్తున్నాయి.
ట్రాక్టర్ ర్యాలీ సందర్భంగా చెలరేగిన హింసకు సంబంధించి ప్పటివరకు 22 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. వీటిల్లో రాకేశ్ టికాయత్, మేధా పాఠక్, బుటా సింగ్, యోగేంద్ర యాదవ్తో పాటు మొత్తం మీద 37మంది రైతు నేతల పేర్లు ఉన్నట్టు తెలుస్తోంది.ఘర్షణలకు సంబంధించి ఇప్పటివరకు 200మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం వారిని పోలీసులు విచారిస్తున్నారు.