అఖిలేష్ యాదవ్ కు సుప్రీం కోర్టు వార్నింగ్
న్యూఢిల్లీ: లోకాయుక్త న్యాయమూర్తి నియామకం విషయంలో ఉత్తర్ ప్రదేశ్ లోని అఖిలేష్ యాదవ్ ప్రభుత్వం తమను తప్పుదోవ పట్టించిందని సుప్రీం కోర్టు తీవ్రస్థాయిలో మండిపడింది. లోకాయుక్త న్యాయమూర్తి నియామకం ఇక తామే చూసుకుంటామని తేల్చి చెప్పింది.
ఉత్తరప్రదేశ్ లోకాయుక్త న్యాయమూర్తిగా రిటైడ్ జడ్జి వీరేంద్ర సింగ్ నియామకాన్ని కొనసాగించాలా ? లేక రద్దు చెయ్యాలా అనే విషయంలో తాము త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని బుధవారం సుప్రీం కోర్టు స్పష్టం చేసింది.
దాదాపు సంవత్సరం తరువాత గత నెలలో ఉత్తరప్రదేశ్ లోకాయుక్త న్యాయమూర్తిగా రిటైడ్ జడ్జి వీరేంద్ర సింగ్ ను సుప్రీం కోర్టు నియమించింది. వీరేంద్ర సింగ్ నియామకంలో యూపీ ప్రభుత్వం తమను తప్పుదోవ పట్టించిందని సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
యూపీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్, ప్రతిపక్ష నాయకుడు, అలహాబాద్ హై కోర్టు చీఫ్ జస్టిస్ డీ.వై. చంద్రచూడ్ తో కూడిన కమిటి వీరేంద్ర సింగ్ నియామకాన్ని ఏకగ్రీవంగా ఆమోదించిందని యూపీ ప్రభుత్వం సుప్రీం కోర్టుకు తెలిపింది.
అయితే జస్టిస్ వీరేంద్రసింగ్ సరైన వ్యక్తిత్వం లేదని అలహాబాద్ హైకోర్టు చీఫ్ జస్టిస్ డీ.వై. చంద్రచూడ్ సుప్రీం కోర్టుకు లేఖ వ్రాశారు. లోకాయుక్త న్యాయమూర్తి విషయంలో తమను సంప్రదించలేదని యూపీ ప్రతిపక్ష నాయకుడు, బీఎస్పీ నేత స్వామీ ప్రసాద్ మౌర్య సుప్రీం కోర్టు దృష్టికి తీసుకు వెళ్లారు.
ఈ వివరాలు తెలుసుకున్న సుప్రీం కోర్టు అఖిలేష్ యాదవ్ ప్రభుత్వం మీద మండిపడింది. లోకాయుక్త నియామకం విషయంలో మీ జోక్యం అవసరం లేదని, ఇక మీద తామే చూసుకుంటామని సుప్రీం కోర్టు తేల్చి చెప్పింది.