సంచలనం: ఆర్కామ్ డైరెక్టర్ పదవికి అనిల్ అంబానీ రాజీనామా
ముంబై: రిలయన్స్ కమ్యూనికేషన్(ఆర్కామ్) అధినేత అనిల్ అంబానీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆర్కామ్ డైరెక్టర్ పదవి నుంచి ఆయన తప్పుకున్నారు. ఈ మేరకు శనివారం ఆయన తన పదవికి రాజీనామా చేసినట్లు ప్రకటించారు.
అనిల్ అంబానీతోపాటు నలుగురు
అనిల్ అంబానీతోపాటు విరానీ, రైనా కరణి, మంజరి కాకర్, సురేష్ రంగాచర్ అనే నలుగురు డైరెక్టర్లు కూడా రాజీనామా చేశారు. రాజీనామా పత్రాలను కంపెనీలోని బీఎస్ఈ, ఎన్ఎస్ఈ పరిశీలనకు పంపినట్లు తెలిసింది.
సంక్షోభంలో ఆర్కాం
భారీ నష్టాలు, అప్పులతో ఆర్కామ్ సంక్షోభంలో కూరుకుపోయిన విషయం తెలిసిందే. బకాయిలు చెల్లించలేక ఆర్కామ్ తన మొబైల్ సేవలను కూడా నిలిపివేసింది. దాదాపు దివాళా తీసే పరిస్థితులకు చేరువైంది.
30వేల కోట్ల నష్టాలు..
కాగా, ఏడాది రెండో త్రైమాసికంలో లైసెన్స్ ఫీజులు, స్పెక్ట్రమ్ బకాయిల కేటాయింపుల అనంతరం కంపెనీ నష్టాలు రూ. 30,142 కోట్లకు చేరుకున్నాయి. అయితే, కొన్ని విషయాల్లో అనిల్ అంబానీ సోదరుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేష్ అంబానీ ఆయనను ఆదుకునే ప్రయత్నం చేశారు.
దివాళా పిటిషన్..
ఈ సంస్థకు మొత్తం 50 వేల కోట్ల రూపాయలకు పైగా బ్యాంకు రుణాలు ఉన్నాయి. ఎరిక్సన్ సంస్థకు 1500 కోట్ల రూపాయల రుణాన్ని ఆర్ కామ్ చెల్లించాల్సి ఉంది. ఆ సంస్థ యాజమాన్యం సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేయగా.. ముఖేష్ అంబాని జోక్యం చేసుకున్నారు. తన తమ్ముడి తరఫున 450 కోట్ల రూపాయలను ఆ సంస్థకు చెల్లించారు. చైనా డెవలప్మెంట్ బ్యాంక్నకు ఒక బిలియన్ డాలర్లకు పైగా మొత్తాన్ని రుణ రూపంలో చెల్లించాల్సి ఉంది ఆర్ కామ్. సంస్థను దివాళా తీసినట్లు ప్రకటించాలని కోరుతూ గురువారం అనిల్ అంబానీ నేతృత్వంలోని డైరెక్టర్ల బోర్డు.. ఎన్సీఎల్టీకి ప్రతిపాదనలను పంపించింది. దీన్ని పరిశీలించిన అనంతరం ఎన్సీఎల్టీ.. ఈ ప్రతిపాదలపై ఆమోదముద్ర వేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే దాఖలైన దివాళా పిటిషన్ పైన నేషనల్ కంపెనీ లా అప్పెలట్ ట్రైబ్యునల్, సుప్రీం కోర్టు ఇదివరకు స్టే విధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తమకు 357 రోజులు మినహాయింపు ఇవ్వాలని ఆర్కాం సంస్థ విజ్ఞప్తి చేసింది. దీన్నిట్రైబ్యునల్ అంగీకరించింది. ఈ కేసులో తదుపరి విచారణను మే 30 నాటికి వాయిదా వేసింది. అప్పటికి కేసు పురోగతిపై నివేదిక ఇవ్వాలని రిసొల్యూషన్ ప్రొఫెషనల్కు ఆదేశాలు జారీ చేసింది ట్రైబ్యునల్. దీంతో ఆర్.కామ్ స్పెక్ట్రంను జియోకు విక్రయించేందుకు సిద్ధపడింది. వివాదాల నేపథ్యంలో ప్రభుత్వం నుంచి అనుమతులు అందలేదు.