అనిల్ అంబానీ కేసు: జడ్జి తీర్పును మార్చి, వెబ్సైట్లో పెట్టారు, సీజేఐ చర్యలు
న్యూఢిల్లీ: ఓ జడ్జి ఇచ్చిన తీర్పును ట్యాంపరింగ్ చేసి, తప్పుడు తీర్పును వెబ్సైట్లో అప్ లోడ్ చేసినందుకు సుప్రీం కోర్టులో పని చేసే ఇద్దరు అధికారులపై సీజే జస్టిస్ రంజన్ గొగోయ్ వారిని విధుల నుంచి తొలగించారు.
బకాయిలు చెల్లించనందుకు అనిల్ అంబానీకి చెందిన రిలయెన్స్ గ్రూప్ పైన ఎరిక్సన్ ఇండియా సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఎరిక్సన్ ఇండియా పిటిషన్ పైన విచారణ చేపట్టిన జస్టిస్ ఆర్ఎఫ్ నారిమన్, జస్టిస్ వినీత్ శరణ్ నేతృత్వంలోని ధర్మాసనం జనవరి 7వ తేదీన అనిల్ అంబాని, మరికొందరు రిలయెన్స్ ప్రతినిధులకు కోర్టు ధిక్కారణ నోటీసులు జారీ చేసింది.
ఈ కేసులో అనిల్ అంబానీ సహా మిగతా అందరూ తప్పనిసరిగా వ్యక్తిగతంగా కోర్టు ఎదుట హాజరుకావాలని ధర్మాసనం ఆదేశించింది. జస్టిస్ నారిమన్ ఆదేశాలను జనవరి 7న సుప్రీం కోర్టు వెబ్సైట్లో అప్లోడ్ చేశారు. కానీ అందులో ధర్మాసనం ఆదేశాలకు భిన్నంగా.. ధిక్కరణకు పాల్పడిన వారు వ్యక్తిగతంగా హాజరుకావాల్సిన అవసరం లేదని ఉంది. దీంతో ఈ విషయాన్ని ఎరిక్సన్ ప్రతినిధులు, సీనియర్ లాయర్ దుష్యంత్ దవే జస్టిస్ నారిమన్ దృష్టికి తీసుకెళ్లారు.
వెబ్సైట్లో తప్పుగా ఉండటంపై జస్టిస్ నారిమన్ వెంటనే దానిని సరిచేయించారు. అనంతరం దీనిపై విచారణకు ఆదేశించారు. విచారణలో ఇది ఉద్దేశపూర్వకంగా జరిగిన తప్పు అని తేలింది. సుప్రీం కోర్టు అసిస్టెంట్ రిజిస్ట్రార్లుగా పనిచేస్తున్న మానవ్ శర్మ, తపన్ కుమార్ చక్రవర్తి కావాలనే తీర్పును మార్చినట్లు విచారణలో తేలింది. దీంతో జస్టిస్ నారిమన్ ఈ విషయాన్ని సీజేఐ జస్టిస్ రంజన్ గొగోయ్కి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదును పరిశీలించిన అనంతరం సీజేఐ తన విశేషాధికారాలతో వారిని విధుల నుంచి తొలగించారు.