అన్నదమ్ముల అనుబంధం: అనిల్ అంబానీ జైలుకెళ్లకుండా ఆదుకున్న రక్తసంబంధం
Recommended Video
తమ్ముడిని అన్న ఆదుకున్నాడు. వ్యాపారంలో విబేధాలు, పోటీ ఉన్నప్పటికీ... తమ్ముడు కష్టాల్లో ఉండటాన్ని చూడలేకపోయింది రక్త సంబంధం. అందుకే నేనున్నానంటూ ముందుకొచ్చి తమ్ముడికి అన్న అండగా నిలబడ్డాడు. ఇదంతా ఎవరి గురించి అనుకుంటున్నారా... అంబానీ సోదరుల గురించే. అవును అనిల్ అంబానీ పీకల్లోతు కష్టాల్లో ఉన్న సమయంలో తను తమ్ముడికి అండగా నిలబడ్డాడు ముఖేష్ అంబానీ. ఇంతకీ ఆ కథ ఏమిటి... అనిల్కు కష్టం ఎందుకొచ్చింది... ముఖేష్ అంబానీ సోదరుడికి ఎలాంటి సహాయం చేశాడు...?
అప్పుల ఊబిలో కూరుకుపోయిన అనిల్ అంబానీ
అనిల్ అంబానీ... రిలయన్స్ కమ్యూనికేషన్స్ లిమిటెడ్ అధినేత. వ్యాపారంలో కలిసిరాక అప్పుల ఊబిలో కూరుకుపోయారు. ఓ వైపు అన్న జియోతో దూసుకుపోతుంటే తమ్ముడు అనిల్ అంబానీ మాత్రం ఉన్న కంపెనీనే నడుపలేక.. అప్పులు తీసుకొచ్చి మరీ సంస్థను నడిపించే ప్రయత్నం చేశాడు. అప్పటికీ తన రిలయన్స్ కమ్యూనికేషన్స్ లాభాల బాట పట్టకపోవడంతో అనిల్ అంబానీ తన సంస్థకు చెందిన కార్యకలాపాలు నిర్వహించాలంటూ స్వీడిష్ కంపెనీ ఎరిక్సన్కు బాధ్యతలు అప్పగించాడు. దీంతో 2014 నుంచి రిలయన్స్ కమ్యూనికేషన్స్కు సంబంధించిన ఆపరేషన్స్ అన్నీ ఎరిక్సన్ సంస్థ నిర్వహిస్తోంది.
సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఎరిక్సన్
కథ ఇంతవరకు బాగానే ఉంది. అయితే తాము కుదుర్చుకున్న ఒప్పందంలో భాగంగా రిలయన్స్ సంస్థ ఎరిక్సన్కు చెల్లించాల్సిన డబ్బులు చెల్లించకుండా తాత్సారం చేస్తూ వచ్చింది. దీంతో ఎరిక్సన్ సంస్థ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఫిబ్రవరిలో అనిల్ అంబానీపై వచ్చిన ఆరోపణలు నిజమేనని తేల్చిన న్యాయస్థానం నాలుగువారాల్లోగా డబ్బులు మొత్తం చెల్లించాలని లేనిపక్షంలో మూడునెలలు జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని ఆదేశించింది. ఇక డబ్బులు చెల్లించేందుకు చివరి తేదీగా మార్చి 19న సుప్రీంకోర్టు విధించింది.
నీరవ్ మోడీకి షాక్: ఈడీ అభ్యర్థనపై అరెస్టు వారెంట్ జారీ చేసిన లండన్ కోర్టు
కోర్టు ఆదేశాలను పక్కనబెట్టడంతో సీరియస్
అసలు కథలోకి వెళితే మొత్తం రూ.1500 కోట్లు ఒప్పందం ఎరిక్సన్ రిలయన్స్ కమ్యూనికేషన్స్ మధ్య జరిగింది. ఈ డబ్బులు చెల్లించకపోవడంతో ఎరిక్సన్ ముందుగా నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ను ఆశ్రయించింది. ఇక్కడ రూ.550 కోట్లు చెల్లించాలంటూ సెటిల్ చేసింది నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్.అయితే ఇది 30సెప్టెంబరు 2018లోగా చెల్లించాలని ఆదేశించింది. అయితే చివరి తేదీ దాటినప్పటికీ రిలయన్స్ కమ్యూనికేషన్ సంస్థ డబ్బులు చెల్లించకపోవడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించింది. డిసెంబరు 15, 2018లోగా డబ్బులు మొత్తం చెల్లించాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. ఇక్కడ కూడా గడువు దాటిపోవడంతో అనిల్ అంబానీతో పాటు మరో ఇద్దరిపై కోర్టు ధిక్కారణ కేసు వేసింది ఎరిక్సన్. ఫిబ్రవరిలో రూ. 118 కోట్లు రిలయన్స్ సంస్థ సుప్రీంకోర్టులో డిపాజిట్ చేసింది.ఇక మిగతాది కట్టేందుకు తన దగ్గర డబ్బులు లేకపోవడంతో నేనున్నానంటూ ముఖేష్ అంబానీ ఆపన్నహస్తాన్ని అందించారు.
తమ్ముడి కోసం కదిలివచ్చిన అన్న ముఖేష్ అంబానీ
రూ.458.77 కోట్లు ఎరిక్సన్కు చెల్లించేందుకు తనదగ్గర డబ్బులు లేకపోవడంతో ఇక తప్పని పరిస్థితుల్లో జైలులో కూర్చోవాల్సిన పరిస్థితి తలెత్తింది అనిల్ అంబానీకి. అయితే తమ్ముడు జైలుకు వెళ్లడం ఇష్టపడని అన్న ముఖేష్ అంబానీ వెంటనే ఆ డబ్బులును చెల్లించారు. ఇక ఆ డబ్బులను ఎరిక్సన్ సంస్థకు చేరవేయడంతో ఆ కంపెనీ కూడా తనకు డబ్బులు మొత్తం చేరిందని స్పష్టం చేసింది. ఎరిక్సన్కు కట్టాల్సిన మొత్తం బకాయిలను రిలయన్స్ సంస్థ కట్టేసినట్లు ప్రతినిధి తెలిపారు. అయితే ఈ డబ్బును మొత్తాన్ని అనిల్ అన్న ముఖేష్ అంబానీ చెల్లించాడు. దీంతో ఇంత మొత్తంలో డబ్బులు కట్టి తనను ఆదుకున్నందుకు అన్న ముఖేష్ అంబానీకి, వదిన నీతా అంబానీకి అనిల్ అంబానీ కృతజ్ఞతలు తెలిపారు. తను కష్టకాలంలో ఉన్నప్పుడు ఆపన్న హస్తం అందించి తన కుటుంబం ఏమిటో మరోసారి ప్రపంచానికి తెలియజేశారని కొనియాడారు.తన మొత్తం కుటుంబం ముఖేష్ అంబానీ కుటుంబానికి రుణపడి ఉంటామని అనిల్ అంబానీ ఓ ప్రకటనలో తెలిపారు.