సీబీఐ డైరెక్టర్గా బాధ్యతలు చేపట్టిన అనిల్ సిన్హా... కేసుల విచారణలో ముందడుగు
న్యూఢిల్లీ: సీబీఐ డైరెక్టర్గా అనిల్ కుమార్ సిన్హా బుధవారం ఉదయం బాధ్యతలు స్వీకరించారు. కర్తవ్య నిర్వహణలో ఎదురైయ్యే సవాళ్ల పట్ల తాను అప్రమత్తంగా ఉంటానని ఈ సందర్భంగా అనిల్ సిన్హా వెల్లడించారు. అందరి సహకారంతో కేసుల విచారణలో ముందడుగు వేస్తానని అన్నారు.
సెంట్రల్ బ్యూర్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) కొత్త డైరెక్టర్గా అనిల్ సిన్హా నియమితులయ్యారు. ఈ మేరకు మంగళవారం రాత్రి పొద్దుపోయిన తర్వాత ప్రధాన మంత్రి కార్యాలయం (పీఎంఓ) ఉత్తర్వులు జారీ చేసింది. 1979 ఐపీఎస్ బ్యాచ్కు చెందిన అనిల్ సిన్హా, బీహార్ కేడర్కు చెందిన సీనియర్ పోలీసు అధికారి.
నిన్నటివరకు వరకు సీబీఐ డైరెక్టర్గా కొనసాగిన రంజిత్ సిన్హా మంగళవారం పదవీ విరమణ చేశారు. దీంతో ప్రధాని నరేంద్ర మోడీ, సుప్రీంకోర్టు ఛీఫ్ జస్టిస్ హెచ్ఎల్ దత్తు, లోక్ సభలో కాంగ్రెస్ పార్టీ నేత మల్లికార్జున ఖర్గేలతో కూడిన లోక్పాల్ ఎంపిక కమిటీ మంగళవారం ప్రధాని అధికారిక నివాసంలో భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా ఇద్దరు పోలీస్ అధికారుల పేర్లను కమిటీ ఎంపిక చేయగా, వాటిలో నుంచి అనిల్ సిన్హా పేరును ఖరారు చేస్తూ ప్రధాని నరేంద్ర మోడీ నిర్ణయం తీసుకున్నారు. సీబీఐ డైరెక్టర్గా అనిల్ సిన్హా రెండు సంవత్సరాల పాటు తన సేవలను అందించనున్నారు. నిన్నటి వరకు అనిల్ సిన్హా ఢిల్లీ సీబీఐ స్పెషల్ డైరక్టర్గా పనిచేశారు.