జంతువులపై కరోనా వ్యాక్సిన్ ట్రయల్స్ సక్సెస్- భారత్ బయెటెక్ ప్రకటన
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారికి అడ్డుకట్టే వేసేందుకు తయారు చేసిన వ్యాక్సిన్ ట్రయల్స్ ఉధృతంగా కొనసాగుతున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్ధ మార్గదర్శకాల ప్రకారం సాగుతున్న ఈ ట్రయల్స్ ఫలితాల కోసం ప్రపంచ దేశాలన్నీ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి. ఈ నేపథ్యంలో ముందుగా జంతువులపై కొన్ని నెలలుగా తాము నిర్వహించిన ట్రయల్స్ విజయవంతమైనట్లు హైదరాబాద్కు చెందిన భారత్ బయోటెక్ సంస్ధ సంచలన ప్రకటన చేసింది. ఇక మనుషులపై సాగుతున్న ట్రయల్స్ కూడా విజయవంతమైతే వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినట్లేనని భావిస్తున్నారు.
Recommended Video
కరోనా వ్యాక్సిన్ ట్రయల్స్ సక్సెస్..
హైదరాబాద్కు చెందిన భారత్ బయోటెక్ సంస్ధ కరోనా మహమ్మారికి అడ్డుకట్ట వేసే వ్యాక్సిన్ను ఈ ఏడాది మే నెలలో అభివృద్ధి చేసింది. దీన్ని తొలుత జంతువులపై ప్రయోగించింది. ఇందులో తాము విజయవంతం అయినట్లు భారత్ బయోటెక్ సంస్ధ తాజాగా ప్రకటించింది. కరోనా వ్యాక్సిన్ కోవాక్సిన్ ట్రయల్స్ లైవ్ వైరల్ ఛాలెంజ్లో సురక్షితమని తేలినట్లు బయోటెక్ సంస్ధ ట్వీట్ చేసింది. తమ అధ్యయనంలో ఈ టీకా రోగ నిరోధక శక్తి కలిగి ఉందని తేలిందని భారత్ బయోటెక్ తెలిపింది. తాజా ట్రయల్స్తో కలిపి భారత్ బయోటెక్ ఈ వ్యాక్సిన్పై రెండుసార్లు ట్రయల్స్ నిర్వహించినట్లయింది.
నాలుగుదశల్లో ట్రయల్స్.
భారత్ బయోటెక్ జంతువులపై నిర్వహించిన ట్రయల్స్ను నాలుగు దశలుగా విభజించారు. ప్రతీ దశలోనూ ఐదేసి కోతుల చొప్పన ఎంపిక చేసి వాటిపై టీకా ప్రయోగించారు. తొలిసారి ఓ డోస్ ఇచ్చిన తర్వాత తిరిగి 14 రోజుల్లో వీటికి మరో డోస్ ఇచ్చారు. వీటికి కోతులు తట్టుకుంటున్నట్లు తేలిందని భారత్ బయోటెక్ తెలిపింది. మూడు వారాల్లో వీటికి రోగ నిరోధక యాండీబాడీలు పెరిగాయని తేల్చారు. ఎలాంటి ఇతర ఇన్పెక్షన్లు కూడా సోకలేదని కూడా తెలిసింది. దీంతో జంతువులపై రెండోదశ ట్రయల్స్ కోసం భారత్ బయోటెక్ డ్రగ్ కంట్రోల్ అథారిటీ అనుమతి కూడా కోరింది. ఐసీఎంఆర్, జాతీయ వైరాలజీ సంస్ధ సహకారంతో భారత్ బయోటెక్ ఈ కోవాక్సిన్ టీకాను తయారు చేసింది.
నిమ్స్లో రెండో దశ ట్రయల్స్..
హైదరాబాద్ నిమ్స్లో మనుషులపై రెండోదశ ట్రయల్స్లో భాగంగా నిన్న మరో పదిమంది వాలంటీర్లకు టీకా ఇచ్చారు. దీంతో ఈ ట్రయల్ పూర్తయినట్లు భారత్ బయోటెక్ ప్రకటించింది. తొలిదశ ట్రయల్స్లో భాగంగా మొత్తం 50 మందికి వ్యాక్సిన్ ఇచ్చారు. వీరికి రెండు వారాల తర్వాత బూస్టర్ డోస్ ఇచ్చారు. అలాగే రెండోదశ ట్రయల్స్ కోసం ఎంపిక చేసిన 45 మందికి టీకా ప్రయోగించారు. వీరికి 28 రోజుల తర్వాత బూస్టర్ డోస్ ఇవ్వనున్నారు. వీరి పరిస్ధితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ వైరాలజీ ల్యాబ్కు శాంపిల్స్ పంపుతున్నారు. ఆ తర్వాత మూడో దశ ట్రయల్స్ మొదలవుతాయి. ఇందుకోసం ఐసీఎంఆర్ అనుమతుల కోసం ఎదురుచూస్తున్నట్లు భారత్ బయోటెక్ ప్రతినిధులు తెలిపారు.