టెండూల్కర్ రిటైర్మెంట్పై భార్య అంజలికే తెలుసు?
ముంబై: అంతర్జాతీయ టెస్టు మ్యాచుల నుంచి మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ఎప్పుడు తప్పుకుంటాడనేది ఆయన భార్య అంజలికి మాత్రమే తెలుసునని అంటున్నారు. తన 200వ టెస్టు మ్యాచు ఆడిన తర్వాత రిటైర్మెంట్ ప్రకటించాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బిసిసిఐ) సచిన్ టెండూల్కర్పై ఒత్తిడి తెస్తున్నట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే.
నవంబర్లో వెస్టిండీస్ భారత్లో రెండు టెస్టు మ్యాచులు ఆడనుంది. ఇప్పటి వరకు 198 టెస్టులు ఆడిన సచిన్ ఈ రెండు టెస్టు మ్యాచులతో 200 టెస్టుల మైలు రాయి చేరుకుంటాడు. వెస్టిండీస్తో చివరి టెస్టు ఆడిన తర్వాత రిటైర్ కావాలని బిసిసిఐ ఆయనకు సూచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
అయితే, 40 ఏళ్ల సచిన్ టెండూల్కర్ బిసిసిఐతో పోరాడకుండా రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం లేదని అంటున్నారు. తన రిటైర్మెంట్పై అధికారిక విజ్ఞప్తి వస్తేనే తాను స్పందించాలని సచిన్ టెండూల్కర్ అనుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే, అతను ఎప్పుడు రిటైర్ అవుతారనేది మాత్రం ఆయన సతీమణి అంజలికి తెలుసునని ఆయన సన్నిహిత వర్గాలంటున్నాయి.
టెండూల్కర్ రిటైర్మెంట్ అంశాన్ని జాగ్రత్తగా పరిష్కరించాలని సచిన్ మిత్రుడు, ముంబై సహచరుడు ప్రవీణ్ ఆమ్రే అన్నట్లు జాతీయ మీడియా మంగళవారం రాసింది. బోర్డుకు తన ప్రణాళిక ఉండవచ్చునని, అయితే సచిన్ సాధారణ క్రికెటర్ కాడని, ఇరు పక్షాల మధ్య సమాచార వినమయాన్ని పెంచుకోవాలని, పరస్పరం అభిప్రాయాలను పంచుకోవాలని ఆయన అన్నట్లు జాతీయ మీడియా రాసింది. ఎప్పుడు రిటైర్ కావాలో సచిన్కు తెలుసునని, అందుకు అనుగుణంగా బోర్డు వ్యవహరించాలని ఆమ్రే అన్నట్లు ఓ ముంబై డైలీ రాసింది.