అన్నా హజారే ఆమరణ నిరాహార దీక్ష రద్దు: డిమాండ్లకు కేంద్రం ఓకే, దేవేంద్ర ఫడ్నవీస్ భేటీ
న్యూఢిల్లీ: కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని ప్రకటించిన సామాజిక కార్యకర్త అన్నా హజారే తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. కేంద్ర ప్రభుత్వం ఆయన డిమాండ్లలో కొన్నింటికి అంగీకరించడంతో దీక్ష నిర్ణయాన్ని విరమించుకున్నట్లు వెల్లడించారు.
84 ఏళ్ల అన్నా హజారే శుక్రవారం ఒక ప్రకటనలో రైతులకు మద్దతుగా, వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా శనివారం నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని పేర్కొన్న విషయం తెలిసిందే. మహారాష్ట్రలోని తన స్వగ్రామం రాలేగావ్ సిద్ధిలోనే దీక్ష చేపడతానని చెప్పారు. తాను ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్కు రైతుల దుస్థితిపై ఐదు సార్లు లేఖలు రాశానని, అయితే, వారి నుంచి ఎలాంటి స్పందనా రాలేదని చెప్పారు.
ఆ తర్వాత శుక్రవారం సాయంత్రం అన్నా హజారే మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం తన డిమాండ్లలో కొన్నింటిని అమలు చేస్తామని, రైతుల బాగు కోసం కమిటీ వేస్తామని కూడా చెప్పిందన్నారు. ఈ నేపథ్యంలోనే తాను శనివారం నుంచి చేపట్టాలనుకున్న ఆమరణ నిరాహార దీక్షను రద్దు చేసుకుంటున్నట్లు అన్నా హాజారే తెలిపారు.
కాగా, కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ అధికారి కైలాష్ చౌధరి, మహారాష్ట్ర ప్రతిపక్ష నేత దేవేంద్ర ఫడ్నవీస్, ఇతర బీజేపీ నేతలు.. అన్నా హజారేను కలిశారు. ఆయనను ఒప్పంచి శనివారం నాటి ఆమరణ నిరాహార దీక్షను నిలిపివేయించారు.
'వ్యవసాయ మంత్రిత్వ శాఖ, నీతి ఆయోగ్, అన్నా హజారే సిఫారసు చేసిన కొంతమంది సభ్యులతో కూడిన కమిటీ వచ్చే ఆరు నెలల్లో రైతులకు సంబంధించిన అన్నా హజారే డిమాండ్లను అమలు చేయడానికి / నెరవేర్చడానికి ఒక ప్రతిపాదనను తీసుకుంటుందని నేటి సమావేశంలో నిర్ణయించారు' అని అన్నా హజారే కార్యాలయం నుంచి ఓ ప్రకటన వెలువడింది.
కాగా, 2011లో అవినీతి వ్యతిరేక ఉద్యమంలో ముందంజలో ఉన్న హజారే ఢిల్లీలోని రామ్లీలా మైదాన్లో నిరాహార దీక్షకు దిగినప్పుడు అప్పటి యూపీఏ ప్రభుత్వం పార్లమెంటు ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటుచేసినట్లు గుర్తుచేసింది.