లోక్పాల్, లోకాయుక్త: మళ్లీ నిరాహార దీక్షకు దిగిన అన్నాహజారే
రాలేగావ్: ప్రముఖ సంఘసంస్కర్త అన్నాహజారే మరోసారి నిరాహార దీక్షకు దిగారు. లోక్పాల్, లోకాయుక్తలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఆయన తన స్వగ్రామం రాలేగావ్లో బుధవారం ఉదయం ఈ దీక్షను చేపట్టారు. లోక్పాల్, లోకాయుక్త నియామకాల్లో జాప్యాన్ని ఆయన తీవ్రంగా నిరసించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. లోక్పాల్ బిల్లు 2013లోనే పార్లమెంటు ఆమోదం పొందిందని చెప్పారు. కానీ ఇంత వరకు లోక్పాల్, లోకాయుక్తలను నియమించలేదని కేంద్రంపై విమర్శలు గుప్పించారు. దీని గురించి అసలు ఏ పార్టీ పట్టించుకోవడం లేదన్నారు. వాటిని ఏర్పాటు చేసే వరకు తాను దీక్ష విరమించేది లేదని స్పష్టం చేశారు.
తాము అధికారంలోకి వస్తే లోక్పాల్, లోకాయుక్తలను నియమిస్తామని కేంద్రం చెప్పిందని అధికారంలోకి వచ్చి నాలుగేళ్లయినా పట్టించుకోలేదని విమర్శించారు. అలాగే రైతుల సమస్యలను పరిష్కరించాలని చెప్పారు. వీటి గురించి ఏ పార్టీ పట్టించుకోవడం లేదన్నారు.
ఇటీవల అన్నాహజారే మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్కు లేఖ రాశారు. లోకాయుక్తను ఏర్పాటు చేయకుంటే తాను దీక్షకు దిగుతానని చెప్పారు.
2014లో అవినీతిరహిత ప్రభుత్వం అనే నినాదంతో మోడీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారని, ఆయన లోక్పాల్ బిల్లును అమలు చేస్తారని, తద్వారా దేశంలో అవినీతికి కళ్లెం పడుతుందని ఆశించానని, అయిదేళ్లు గడిచినా ఇప్పటికీ ఆ దిశగా అడుగులు పడలేదని, ప్రభుత్వం కావాలనే దీనిని ఆలస్యం చేస్తూ వస్తోందని, అందుకే తాను మరోసారి దీక్షకు దిగుతున్నానని హజారే చెప్పారు.