మమతా చుట్టూ రాజకీయం..అన్నా హజారేను పట్టించుకునే వారేరీ?
ముంబై: మూడు రోజులుగా దేశ రాజకీయాలన్నీ పశ్చిమ బెంగాల్ చుట్టే తిరుగుతున్నాయి. పశ్చిమ బెంగాల్, మమతా బెనర్జీ, సీబీఐ.. ఇదీ పరిస్థితి. మీడియా మొత్తం మమతా బెనర్జీ మీదే ఫోకస్ పెట్టింది. సీబీఐ దర్యాప్తును వ్యతిరేకిస్తూ కోల్ కతలో మమతా బెనర్జీ చేపట్టిన ఆందోళన మూడో రోజుకు చేరుకోగా.. అయ్యో పాపం అంటూ వివిధ పార్టీల నేతలంతా ఆమె చుట్టూ చేరుకున్నారు. సంఘీభావాన్ని తెలుపుతున్నారు. మద్దతు ఇస్తున్నారు. సీబీఐని ఉద్దేశపూరకంగా ఉసిగొల్పిందంటూ కేంద్రప్రభుత్వం నిందలు వేస్తున్నారు. మమతా బెనర్జీ చేస్తోన్నది పక్కా రాజకీయపరమైన ఆందోళన. మిగిలిన నాయకులంతా అదే అవకాశవాద రాజకీయాలను చేస్తూ, చక్కర్లు కొడుతున్నారు. ఇది ఒకవైపు మాత్రమే..
మరోవైపు- లోక్ పాల్ బిల్లు కోసం అన్నా హజారే దీక్ష చేపట్టి వారం రోజులైంది. 81 సంవత్సరాల వయస్సులో మహారాష్ట్రలోని తన స్వగ్రామం రాలేగావ్ సిద్ధిలో అన్నా హజారే చేపట్టిన నిరాహార దీక్ష మంగళవారం నాటికి ఏడో రోజుకు చేరుకుంది. ఆయన తన కోసం చేస్తున్నారా? లేదే. మమతా బెనర్జీ అండ్ కో తరహాలో తన రాజకీయ భవిష్యత్తు కోసం టెంటు వేశారా? కాదే. లోక్ పాల్ బిల్లు కోసం ఆయన దీక్ష కొనసాగిస్తున్నారు. ఇదే లోక్ పాల్ బిల్లు కోసం ఇదే అన్నా హజారే.. దేశ రాజధానిలో నిరాహార దీక్ష చేస్తే.. దేశం మొత్తం కదిలింది. దేశ ప్రజలంతా ఆయనకు సంఘీభావాన్ని తెలిపారు. అన్నా హజారే తరహాలో టోపీలను ధరించి మరీ ఆయనకు జై కొట్టారు.
అదే అన్నా హాజరే ఇపుడు మళ్లీ దీక్షకు కూర్చున్నారు. ఏ ఒక్కరూ ఆయనను పరామర్శించట్లేదు. ఢిల్లీలో దీక్ష చేస్తున్న సమయంలో అన్నా పక్కనే కూర్చున్న అరవింద్ కేజ్రీవాల్ ముఖ్యమంత్రి అయ్యారు. కిరణ్ బేడీ గవర్నర్ పదవిని అధిష్ఠించారు. అన్నా హజారేకు తమ్ముడినని చెప్పుకొన్న చంద్రబాబు నాయుడు.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జాతీయ జెండాను భుజాన వేసుకుని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ నుంచి ఎన్టీఆర్ ఘాట్ వరకు పాదయాత్ర కూడా చేశారు. అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడుకు ఏనాడూ అన్నా హజారే గుర్తుకు వచ్చి ఉండరు. మరోసారి దీక్ష చేస్తున్న ఆ పెద్దాయనను పరామర్శించ లేదు. అసలు అన్నా హజారే అనే వ్యక్తి దీక్ష చేస్తున్నారనే విషయాన్ని కూడా ఆయన తలకు ఎక్కించుకునే స్థితిలో లేరు. అందుకే- మమతా బెనర్జీ చేపట్టిన ఆందోళన మూడో రోజుకు చేరుకోగానే హుటాహుటిన కోల్ కతకు వెళ్లారు. ఆమెను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు.
ఈ వారం రోజుల్లో అన్నా హజారే ఆరోగ్య పరిస్థితి క్షీణించింది. సుమారు అయిదున్నర కేజీల బరువు తగ్గారు. ఫ్లూయిడ్లను తీసుకోవడానికి నిరాకరిస్తున్నారు. చక్కెర స్థాయి తగ్గిపోయింది. మూత్రపిండాల సమస్య ఇప్పుడిప్పుడే తలెత్తుతోంది. ఎంత త్వరగా ఆయన దీక్షను విరమిస్తే అంత మంచిదని డాక్టర్లు సలహా ఇస్తున్నారు. నిరాహార దీక్ష సాగిస్తే మూత్రపిండాలు పూర్తిగా దెబ్బతినే ప్రమాదం ఉందని చెబుతున్నారు. ఇలాంటి స్థితిలో ఆయనకు ఏ ఒక్క రాజకీయ నాయకుడు కూడా పరామర్శించనప్పటికీ.. స్వగ్రామం మొత్తం అండగా నిలిచింది. రాలేగావ్ సిద్ధి గ్రామస్తులు దశలవారీగా నిరాహార దీక్ష చేస్తున్నారు.
ఆయన డిమాండ్లను నెరవేర్చక పోతే ఆత్మాహుతి చేసుకుంటామని గ్రామ ప్రజలు నినదిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయనను దీక్ష విరమించేలా చేయాలని, ఇందుకు తమ గ్రామస్థులంతా సిద్ధమని ఆయన చెప్పారు. అన్నాతో దీక్ష విరమింపజేయడానికి కేంద్ర ప్రభుత్వం తరఫున రక్షణ శాఖ సహాయ మంత్రి సుభాష్ భమ్రె, మహారాష్ట్ర మంత్రి గిరీష్ మహాజన్ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. కేంద్రం దిగి వచ్చేంత వరకూ దీక్ష కొనసాగుతుందని హజారే స్పష్టం చేశారు. తాజాగా మహారాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన బిల్లు సామాన్యులకు ఉపయోగ పడేది కాదని, అందులో ఎలాంటి కఠిన నిర్ణయాలు లేవని చెప్పారు.