రైతుల ఆందోళనకు మద్దతుగా అన్నా హాజారే: రేపట్నుంచి ఆమరణ నిరాహార దీక్ష
ముంబై: కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్న రైతులకు సామాజిక కార్యకర్త అన్నా హజారే ఇప్పటికే మద్దతు పలికిన విషయం తెలిసిందే. వ్యవసాయ చట్టాలను వెనక్కితీసుకోకుంటే తాను కూడా ఉద్యమిస్తానని ఆయన అన్నారు.
ఈ క్రమంలో రైతులు నిరసనకు మద్దతుగా శుక్రవారం నుంచి మహారాష్ట్రలోని అహ్మద్నగర్లో శనివారం నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని అన్నా హజారే స్పష్టం చేశారు. తన మద్దతుదారులు కూడా తమ తమ సొంత స్థలాల నుంచి నిరసన తెలపాలని కోరారు.
'నేను గత నాలుగు సంవత్సరాలుగా రైతుల ముఖ్యమైన డిమాండ్ల కోసం ఆందోళన చేస్తున్నాను. రైతుల సమస్యపై ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకోనట్లు కనిపిస్తోంది. రైతుల పట్ల ప్రభుత్వం సున్నితంగా లేదు' అని 84 ఏళ్ల ఈ సామాజిక కార్యకర్త ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
*మేము మా డిమాండ్లను కేంద్ర ప్రభుత్వానికి ముందు మరలా ఉంచాము. గత మూడు నెలల్లో నేను ఐదుసార్లు ప్రధానమంత్రి, కేంద్ర వ్యవసాయ మంత్రికి లేఖలు రాశాను. ప్రభుత్వ ప్రతినిధులు ఈ విషయంపై చర్చిస్తున్నారు, కానీ, అవి ఇప్పటివరకు డిమాండ్లకు సంబంధించి సరైన పరిష్కారాన్ని చేరుకోలేదు' అని వ్యాఖ్యానించారు.
కాగా, గత రెండు నెలలుగా నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలంటూ పంజాబ్, హర్యానా రైతులు దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దులో ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. అంతేగాక, గణతంత్ర దినోత్సవ రోజున ట్రాక్టర్ ర్యాలీ కూడా చేశారు. ఈ ర్యాలీలో హింసాత్మక ఘటనలు చోటు చేసుకోవడంతో కొన్ని రైతు సంఘాల నిరసన నుంచి విరమించుకున్నాయి. మరికొన్ని సంఘాల నేతలు మాత్రం ఆందోళనను కొనసాగిస్తున్నారు.