26/11లాంటి దాడికి కుట్ర: అప్రమత్తం చేసిన ఆటో డ్రైవర్
ముంబై: 26/11 ఉగ్రదాడిని తలపించేలా మరో దాడికి కుట్ర జరుగుతోందని ఓ ఆటో డ్రైవర్ నగర పోలీసులను అప్రమత్తం చేశాడు. మరో దేశంలో అల్లకల్లోలం సృష్టించేందుకు ఉగ్రవాదులు పన్నాగం పన్నారని పోలీసులకు తెలియజేశాడు.
అక్టోబర్ 9న తన ఆటోలో ఎక్కిన ముగ్గురు ప్రయాణికులు ఉగ్రదాడి గురించి చర్చించారని పోలీసులకు చెప్పాడు. నగరంలో ఆ ముగ్గురు ఉగ్రదాడికి పాల్పడేందుకు కుట్ర పన్నారని తెలిపాడు.
అయితే ఆటో డ్రైవర్ చెప్పిన విషయమై ముంబై పోలీసులు ఎలాంటి రిస్క్ తీసుకోకుండా ఉగ్రవాద నిరోధక బృందాని(ఏటిఎస్), క్రైం బ్రాంచ్కి సమాచారం అందించారు. దీంతో సంబంధిత అధికారులు వెంటనే పోలీస్ స్టేషన్కు వచ్చి ఆటో డ్రైవర్ను ప్రశ్నించారు.
ఆ డ్రైవర్ నాలుగేళ్లపాటు మలేషియాలో పని చేశాడని ఓ ఏటిఎస్ అధికారి తెలిపారు. ఈ నేపథ్యంలోనే ఆటోలో వచ్చిన ప్రయాణికులు మలేషియాలో భాషలో మాట్లాడుకున్న మాటలు అర్థం చేసుకున్నాడని చెప్పారు.
ఆ ముగ్గురు ప్రయాణికులు మరో వ్యక్తితో మొబైల్ ఫోన్లో సంప్రదింపులు జరిపారని ఆటో డ్రైవర్ చెప్పినట్లు తెలిపారు. అంతేగాక, వారు పంజాబీ మాండలీకంలో ఉర్దూ మాట్లాడినట్లు డ్రైవర్ చెప్పినట్లు ఆ అధికారి తెలిపారు.
‘పని అయిపోయాక నీ కుటుంబాన్ని మేం జాగ్రత్తగా చూసుకుంటాం. ఆందోళన అవసరం లేదు. ఆకా అక్కడ ఉన్నాడు. మేం కసబ్ కుటుంబాన్ని కూడా బాగా చూసుకుంటున్నాం' అని ఆ ముగ్గురు సంభాషించుకున్నట్లు ఆటో డ్రైవర్ అధికారులకు తెలిపాడు.
డ్రైవర్ ఇచ్చిన సమాచారం మేరకు ఇద్దరు అనుమానితుల చిత్రాలను గీయించారు. వారిని అదుపులోకి తీసుకునేందుకు పోలీసు బృందాలను అప్రమత్తం చేశారు. ముంబై నగరంలోని అన్ని ప్రాంతాలను పోలీసులు గాలింపు చేపట్టారు. రెస్టారెంట్లు, హోటళ్లు, లాడ్జీలు, మురికివాడల్లో పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు.
కాగా, 26/11ఉగ్రదాడి దేశ ప్రజలను భయకంపితులను చేసింది. 10మంది లష్కరే తోయిబా ఉగ్రవాదులు ఈ దాడులకు పాల్పడ్డారు. ఉగ్రదాడిలో 160మందికి పైగా మృత్యువాతపడగా, 300మందికిపైగా గాయాలపాలయ్యారు. ఉగ్రదాడికి పాల్పడిన ఉగ్రవాది అజ్మల్ కసబ్ సజీవంగా దొరికాడు. విచారించిన కోర్టు ఉరిశిక్ష వేసింది. 2012లో అతనికి ఉరిశిక్ష అమలైంది.