గుర్గావ్ లో మరో దారుణం .. యువతిపై గ్యాంగ్ రేప్ ఘటన మరువకముందే 16 ఏళ్ళ మైనర్ బాలికపై అత్యాచారం
ఇండియాలో మహిళలు ,బాలికలపై అత్యాచారాలు దేశాన్ని నివ్వెరపోయేలా చేస్తున్నాయి. ఒకపక్క హత్రాస్ ఘటన దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలకు కారణమవుతుంటే, పలు రాష్ట్రాల్లో జరుగుతున్న వరుస ఘటనలు ఎన్డీఏ ప్రభుత్వానికి తలనొప్పిగా మారుతున్నాయి. హత్రాస్ సామూహిక అత్యాచార, హత్య ఘటన తర్వాత మధ్యప్రదేశ్ లోనూ , రాజస్థాన్లోనూ దారుణాలు వెలుగుచూశాయి. నిన్నటికి నిన్న గురు గ్రామ్ (గుర్గావ్ ) లో 25 ఏళ్ళ యువతిపై నలుగురు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన మరచిపోక ముందే ప్రస్తుతం తాజాగా హర్యానాలోని గుర్గావ్ లో ఓ మైనర్ బాలికపై అత్యాచారం జరిగింది.
రాజస్థాన్లోనూ అదే దారుణం: ఇద్దరు మైనర్ బాలికలపై గ్యాంగ్ రేప్..మూడు రోజుల పాటు..!
వాష్ రూమ్ కు వెళ్తుండగా బాలికను తీసుకెళ్ళి బలవంతంగా రేప్
హర్యానాలోని గురుగ్రామ్ (గుర్గావ్ )లో వెలుగు చూసిన ఈ దారుణం విషయానికి వస్తే పదహారేళ్ల బాలికపై ఒక వ్యక్తి అత్యాచారం చేశాడని, బాలిక తండ్రి ఆరోపిస్తున్నారు. గురుగ్రామ్ లోని సెక్టార్ 45 వద్ద వాష్ రూమ్ కి వెళ్తుండగా నిందితుడు బాలికను పట్టుకొని, బలవంతంగా తన గదికి తీసుకువెళ్లి చంపేస్తానని బెదిరించి రేప్ చేసినట్టుగా తండ్రి పోలీసులను ఆశ్రయించారు. బాలిక కూడా ఇదే విషయాన్ని పోలీసులకు చెప్పింది. అత్యాచారం జరిగిందని బాలిక, ఆమె తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించినా పోలీసులు వారిని కేసు పెట్టవద్దని చెప్పటం ఈ ఘటనను బయటకు రాకుండా అడ్డుకోవటానికే అని అర్ధం అవుతుంది.
కేసు నమోదు చెయ్యకుండా తండ్రిని అడ్డుకున్న సెక్టార్ 40 పోలీసులు
అయితే నిన్నటికి నిన్న ఒక యువతిపై సామూహిక అత్యాచారం చేసిన ఘటనపై కేసు నమోదు కాగా , ఈ కేసు కూడా నమోదైతే పోలీసులపై, ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతుందని భావించిన పోలీసులు కేసు పెట్టవద్దని సలహా ఇచ్చారు . గురుగ్రామ్ లోని సెక్టార్ 40 పోలీస్ స్టేషన్ లో ఉన్న పోలీసులు మొదటి ఎఫ్ఐఆర్ దాఖలు చేయకుండా బాధితురాలి కుటుంబాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. కేసు నమోదు చేస్తే అమ్మాయి భవిష్యత్తు పాడైపోతుందని, కోర్టులు, కేసులు ఇదంతా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం అని బాలిక తండ్రిని కేసులు లేకుండా పరిష్కరించుకోవాలని సూచించారు.
కంట్రోల్ రూమ్ కు ఫోన్ చేసి తండ్రి ఫిర్యాదు
కూలీగా పని చేసే బాధితురాలి తండ్రి మొదట పోలీసుల ఒత్తిడి మేరకు కేసు నమోదు చేయలేదు. కానీ ఆపై తన కుమార్తెపై జరిగిన దారుణం తలచుకుని ఆవేదన చెందిన తండ్రి కంట్రోల్ రూమ్ కి ఫోన్ చేసి ఫిర్యాదు చేశారు. లైంగిక వేధింపులపై ఫిర్యాదు అందిన తర్వాత కేసు నమోదు చేసిన పోలీసులు, ప్రస్తుతం కేసును దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో నిందితుడిని ఇంకా పోలీసులు అరెస్ట్ చేయలేదు. నిందితుడి కోసం గాలింపు చేపట్టారు.
గుర్గావ్ లో 25 ఏళ్ల యువతిపై నలుగురు వ్యక్తులు గ్యాంగ్ రేప్ ఘటన మరువక ముందే
నిన్నటికి నిన్న గుర్గావ్లోనే ఒక దారుణం వెలుగు చూసింది . ఓ 25 ఏళ్ల యువతిపై నలుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన చోటు చేసుకుంది . అత్యాచార సమయంలో బాధితురాలు ప్రతిఘటించడంతో ఆమె తలను బలంగా గోడకేసి బాదారు. దీంతో ఆమె తలకు తీవ్ర గాయమైంది. ప్రస్తుతం ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది . ఇక తాజాగా మరో ఘటన వెలుగు చూడటంతో గుర్గావ్ వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు . ఈ దారుణాలను నియంత్రించేలా ప్రభుత్వం చర్య తీసుకోవాలని కోరుతున్నారు.