మరో బీజేపీ కార్యకర్త మృతి .. బ్లాక్ డే పాటిస్తూ శ్రేణుల నిరసన
కోల్కతా : పశ్చిమబెంగాల్లో కార్యకర్తల మృతదేహాలు వెలికివస్తూనే ఉన్నాయి. ఇటీవల టీఎంసీ, బీజేపీ కార్యకర్తల మధ్య జరిగిన ఘర్షణలో 10 మంది చనిపోయిన సంగతి తెలిసిందే. అయితే కొందరు కనిపించకుండా పోయారు. వారిలో ఒకరు శవమై తేలారు. టీఎంసీ దాడులను నిరసిస్తూ బీజేపీ బంద్ పిలుపునిచ్చిన రోజే మరో కార్యకర్త మృతదేహం లభించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
ఒంటిపై గాయాలు ..
మల్దా, బధాపుకురర్వ వద్ద ఆశిష్ సింగ్ (47) అనే బీజేపీ కార్యకర్త విగతజీవిగా కనిపించాడు. అతని మృతదేహంపై గాయాలు కనిపిస్తున్నాయి. టీఎంసీ కార్యకర్తలు దాడి చేసి మట్టుబెట్టారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. టీఎంసీ చర్యలను నిరసిస్తూ ఇప్పటిక రాష్ట్రంలో బ్లాక్ డేగా పాటిస్తూ నిరసన తెలుపుకున్న సంగతి తెలిసిందే. తాజాగా మరో కార్యకర్త మృతదేహం లభించడంతో మరో నిరసన చేపడుతామని బీజేపీ నేతలు ప్రకటించారు. శనివారం ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణతో సోమవారం 12 గంటలపాటు బీజేపీ బంద్ పాటించిన సంగతి తెలిసిందే. మరోవైపు ఆదివారం కూడా సందేశ్ కాలీ వద్ద ముగ్గురు మృతదేహాలను పోలీసులు వెలికితీశారు. మరికొందరి ఆచూకీ లభించకపోగా .. ఒకరు శవమై తేలారు. అయితే తమ కార్యకర్తలు ఐదుగురు చనిపోయారని బీజేపీ చెప్తుండగా .. ఒక్కరేనని టీఎంసీ వాదిస్తోంది. తమ పార్టీకి చెందినవారే 9 మంది ఊపిరొదిలారని పపేర్కంది.
పరిస్థితిపై కేంద్రం ఆరా
బెంగాల్లో పరిస్థితిపై కేంద్రం ఫోకస్ చేసింది. ఇటీవల కేంద్ర హోంశాఖ లేఖ కూడా రాసింది. కార్యకర్తల ఘర్షణలో చనిపోయిన వారికి సంతాపం తెలిపింది. అలాగే రాష్ట్రంలో శాంతిభద్రతలను పునరుద్ధరించేందుకు సరైన చర్యలు తీసుకోవాలని కోరింది. హోంశాఖ లేఖకు పశ్చిమ బెంగాల్ సమాధానం ఇచ్చింది. రాష్ట్రంలో పరిస్థితి అదుపులో ఉందని వివరించింది. శాంతి భద్రతలను పర్యవేక్షించేందుకు పోలీసులు శ్రమస్తున్నారని .. ఇందులో భద్రతా వైఫల్యం లేదని తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో సిచుయేషన్ అంతా బాగానే ఉందని వివరించింది.