చంద్రబాబు నుంచి స్ఫూర్తి పొందారా? : నల్ల చొక్కా ధరించిన మరో ముఖ్యమంత్రి
పుదుచ్చేరి: కొద్దిరోజులుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎప్పుడు చూసినా నల్లచొక్కాను ధరించి కనిపిస్తున్నారు. 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో తొలిసారిగా ఆయన నల్లచొక్కాలను ధరించారు. మరో రెండు, మూడు నెలల్లో ఎన్నికలు ఉన్నాయనగా.. ఇప్పుడు ఆయన కేంద్రప్రభుత్వంపై పోరాటం మొదలు పెట్టారు. భారతీయ జనతాపార్టీ రాష్ట్రానికి అన్యాయం చేసిందని, తీరని ద్రోహం చేసిందని ఆరోపిస్తూ, నల్లచొక్కాలు వేసుకుని నిరసన తెలియజేస్తున్నారు. ఆయన ఒక్కరే కాదు. మంత్రివర్గ సహచరులందరిదీ అదే పరిస్థితి. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా తొలిసారిగా నల్లచొక్కాతో కనిపించిన చంద్రబాబు.. దేశ రాజధాని న్యూఢిల్లీలో నిర్వహించిన ధర్మ పోరాట దీక్షలోనూ ఆయన అదే దుస్తుల్లో కనిపించారు.
ఇదలా వుంచితే- మరో ముఖ్యమంత్రి తాజాగా నల్లచొక్కా ధరించారు. కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఆయన. నిరసనలు తెలియజేయడానికే ఆయన కూడా నల్లచొక్కా వేసుకున్నారు. ఆయనే- పుదుచ్చేరి ముఖ్యమంత్రి వీ నారాయణ స్వామి. కాంగ్రెస్ పాలనలో ఉన్న కేంద్రపాలిత ప్రాంతానికి ముఖ్యమంత్రిగా ఉన్న ఆయన చంద్రబాబు నుంచి స్ఫూర్తి పొందినట్టున్నారు. నారాయణ స్వామితో పాటు ఆయన మంత్రివర్గ సహచరులు కూడా నల్లదుస్తుల్లో నిరసనలు తెలియజేశారు. పుదుచ్చేరిలో హెల్మెట్ల వినియోగాన్ని తప్పనిసరి చేశారు. ఈ మేరకు అక్కడి డీజీపీ ఉత్తర్వులు జారీ చేశారు. దీన్ని నిరసిస్తూ, ఏకంగా ముఖ్యమంత్రి తన మంత్రివర్గ సహచరులతో కలిసి రాజ్ భవన్ ఎదురుగా ధర్నాకు దిగారు. అక్కడే బైఠాయించారు.
తమ నిరసనను తెలియజేస్తూ గవర్నర్ కిరణ్ బేడికి ఓ వినతిపత్రాన్ని అందజేశారు. హెల్మెట్ల వినియోగాన్ని తప్పనిసరి చేస్తూ డీజీపీ జారీ చేసిన ఉత్తర్వులను వెనక్కి తీసుకోవాలని కోరారు. దీనికి ఆమె పెద్దగా స్పందించలేదు. హెల్మెట్ల వినియోగం ఎంత అవసరమో తెలిపారు. తమ డిమాండ్ పట్ల గవర్నర్ స్పందించట్లేదని అంటూ నారాయణ స్వామి, ఆయన మంత్రివర్గ సహచరులు రాజ్ భవన్ వద్దే ధర్నాకు దిగారు. ఫుట్ పాత్ పై బైఠాయించారు. నిరసన ప్రదర్శనలను నిర్వహించారు. గవర్నర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ నిరసన ప్రదర్శనల సందర్భంగా నారాయణ స్వామి నల్లచొక్కా, నల్ల పంచె ధరించారు.
కేంద్ర పాలిత ప్రాంతాల్లో పోలీసు వ్యవస్థ రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో ఉండదు. పోలీసులకు గవర్నరే బిగ్ బాస్. అందుకే- గవర్నర్ ఆదేశాల మేరకే డీజీపీ హెల్మెట్ తప్పనిసరి చేస్తూ ఆదేశాలు జారీ చేశారని నారాయణ స్వామి ఆరోపించారు. హెల్మెట్ల వినియోగాన్ని తప్పనిసరి చేయడం వాహనదారులపై ఆర్థిక భారాన్ని మోపినట్టవుతుందని చెప్పారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఒక్కో హెల్మెట్ 700 రూపాయలకు పైగా పలుకుతోందని, కేంద్రం జీఎస్టీని అమల్లోకి తెచ్చిన తరువాత వాటి ధరలు మరింత పెరిగాయని విమర్శించారు. వాహనదారులపై ఆర్థిక భారాన్ని మోపే ఈ నిబంధనను ఉపసంహరించుకోవాలని అన్నార.