భారత్ లో మరో కరోనా బాధితుడి మరణం .. ఐదుకు చేరిన మృతుల సంఖ్య
ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా మహమ్మారి ఇప్పుడు భారత్ ను వణికిస్తుంది . ఇప్పటికే దేశ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్యా పెరుగుతుంది. ఇప్పటికి కరోనా పాజిటివ్ బాధితుల సంఖ్య 200 కు చేరుకుంది. ఇక కరోనా అనుమానితులు కూడా వందల్లో ఉన్న పరిస్థితి భారత దేశాన్ని భయపెడుతుంది.
ఇప్పటికే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జాతీయ విపత్తుగా పరిగణించి ప్రజల ప్రాణ రక్షణకు నడుం బిగించాయి. యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టి ప్రజలను అప్రమత్తం చేస్తున్నాయి. ఇక ఈ క్రమంలో ఇప్పటికే కరోనా పాజిటివ్ కేసుల్లో నలుగురు మృతి చెందగా తాజాగా మరో కరోనా మరణం సంభవించింది.
భారతదేశంలో కరోనా వైరస్ చాప కింద నీరులా వ్యాపిస్తున్న ఈ వైరస్ ప్రజల ప్రాణాలను హరిస్తుంది. తాజాగా జైపూర్లో ఇటలీకి చెందిన టూరిస్ట్ ఈ వైరస్ వల్ల మృతి చెందాడు. దీంతో మృతుల సంఖ్య 5 కు చేరింది. ఇక ఇప్పటి వరకు కరోనా కారణంగా నలుగురు భారతీయులు, ఒక విదేశీయుడు మృతి చెందారు.
ఇక మృతుడి భార్య మాత్రం కరోనా నుంచి కోలుకున్నట్లు తెలుస్తోంది. ప్రపంచమంతా తన ప్రతాపాన్ని చూపిస్తున్న కరోనా వైరస్ ప్రపంచవ్యాప్తంగా 177 దేశాలకు విస్తరించింది. ఈ వైరస్ బారిన పడి సుమారు 10 వేల మంది మృతి చెందగా, బాధితుల సంఖ్య 2,20,313కు చేరుకుంది.
కరోనా మహమ్మారి అంతకంతకూ వ్యాప్తి చెందుతుండడంతో అప్రమత్తం కావాల్సిన అవసరం ఉందని ఇక భారత ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలను సున్నితంగా హెచ్చరించారు. రెండు ప్రపంచయుద్ధాల కంటే ఇది డేంజర్ అని చెప్పారు. ఇది మనకు పరీక్షా సమయం. కరోనాకు మందులేదు. మనకు పెద్దగా రాదులే, ఏమీ పర్వాలేదులే.. అన్న ఉదాసీనత వద్దు.
బలమైన, సంపన్న, అభివృద్ధి చెందిన దేశాలను సైతం ఇది తీవ్రస్థాయిలో దెబ్బతీసింది.కాబట్టి కరోనా విషయంలో అప్రమత్తంగా ఉండాలని మోడీ చెప్తున్నారు. ఏది ఏమైనా ఎంతగా పోరాడుతున్నా రోజు రోజుకూ కరోనా కేసులు పెరగటం , ఇప్పటికి ఐదుగురు మృత్యువాత పడటం మాత్రం భయాందోళనకు గురి చేస్తుంది.