ఉత్తరప్రదేశ్లో మరో దారుణం... అదే హత్రస్లో మరో దళిత యువతి కిడ్నాప్...
ఉత్తరప్రదేశ్లోని హత్రాస్లో దళిత యువతిపై గ్యాంగ్ రేప్ను నిరసిస్తూ దేశవ్యాప్తంగా ఆగ్రహ జ్వాలలు వ్యక్తమవుతున్న తరుణంలో.. తాజాగా అదే పట్టణంలో మరో దళిత యువతి కిడ్నాప్కు గురైంది. తల్లితో కలిసి ఓ టెంపో వాహనంలో ఇంటికి వెళ్తున్న క్రమంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే... యువతి,ఆమె తల్లి కలిసి సోమవారం(సెప్టెంబర్ 28) హత్రస్లోని సదాబాద్ ప్రాంతానికి వెళ్లారు. అక్కడ కొన్ని మందులు కొనుగులో చేసి సాయంత్రం సమయంలో ఓ టెంపో వాహనంలో ఇంటికి తిరుగు పయనమయ్యారు. అయితే మార్గమధ్యలో యువతి అస్వస్థతకు గురై వాంతులు చేసుకుంది. దీంతో ఆమె తల్లి టెంపో నుంచి కిందకు దిగి వాటర్ బాటిల్ తీసుకొచ్చేందుకు వెళ్లింది.
ఆమె అలా పక్కకు వెళ్లిందో లేదో... అదే అదనుగా టెంపో డ్రైవర్,మరో ఇద్దరు కలిసి యువతిని కిడ్నాప్ చేయాలని నిర్ణయించుకున్నారు. అనుకున్నదే తడవుగా యువతిని కిడ్నాప్ చేసి అదే వాహనంలో అక్కడినుంచి పరారయ్యారు. దీంతో బాధితురాలి తల్లి వెంటనే బంధువులు,పోలీసులకు సమాచారం అందించింది. ఆమె ఫిర్యాదుతో టెంపో డ్రైవర్,మరో ఇద్దరిపై పోలీసులు కేసు నమోదు చేశారు.సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు సాగిస్తున్నారు.
Recommended Video
ఓవైపు దేశమంతా హత్రస్లో దళిత యువతి గ్యాంగ్ రేప్ ఘటనను తీవ్రంగా నిరసిస్తుంటే... అదే పట్టణంలో మరో దళిత యువతి కిడ్నాప్ అవడం తీవ్ర సంచలనం రేకెత్తిస్తోంది. నిజానికి ఉత్తరప్రదేశ్లో క్రైమ్ రేటు ఎక్కువగానే ఉంటుంది. ఇటీవలి కాలంలో అక్కడ మహిళలపై అఘాయిత్యాలు మరింత పెరిగిపోయాయి. గత శుక్రవారం(సెప్టెంబర్ 25) మీరట్లో కదులుతున్న బస్సులోనే ఓ మహిళపై డ్రైవర్,కండక్టర్ కలిసి రాత్రంతా అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం కదులుతున్న బస్సు నుంచే ఆమెను బయటకు విసిరేశారు. హత్రస్ గ్యాంగ్ రేప్ ఘటన,మీరట్ గ్యాంగ్ రేప్ ఘటన రెండూ 2012లో జరిగిన నిర్భయ ఘటనను తలపిస్తున్నాయి.