యూపీలో మరో గ్యాంగ్ రేప్... మరో దళిత యువతి బలి... డ్రగ్స్ ఇచ్చి కిరాతకంగా...
ఉత్తరప్రదేశ్లో మహిళలపై దారుణాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. హత్రాస్ గ్యాంగ్ రేప్ ఘటనపై దేశమంతా నిరసనలు వెల్లువెత్తుతుండగానే మరో దళిత యువతి బలైపోయింది.బలరాంపూర్ జిల్లాలో ఓ యువతిపై కొంతమంది గ్యాంగ్ రేప్కి పాల్పడి కిరాతకంగా హత్య చేశారు. కాలేజీ ఫీజు చెల్లించేందుకని వెళ్లిన తమ కూతురు శవమై కనిపించడంతో ఆ కుటుంబం కన్నీరుమున్నీరవుతోంది. గత వారం రోజుల వ్యవధిలోనే ఉత్తరప్రదేశ్లో దాదాపు నాలుగైదు గ్యాంగ్ రేప్ ఉదంతాలు వెలుగుచూడటం గమనార్హం.
అసలేం జరిగింది...
బాధితురాలి కుటుంబ సభ్యుల కథనం ప్రకారం... బలరాంపూర్ జిల్లాలోని గైన్సరి గ్రామానికి చెందిన యువతి(22) సమీపంలోని ఓ పట్టణంలో బీకాం ద్వితీయ సంవత్సరం చదువుతోంది. మంగళవారం(సెప్టెంబర్ 30) కాలేజీ ఫీజులు చెల్లించేందుకు వెళ్లింది. కాలేజీలో పని ముగించుకుని తిరిగొస్తుండగా... మార్గమధ్యలో కొంతమంది ఆమెను అపహరించారు. ఆపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలు అపస్మారక స్థితిలోకి వెళ్లడంతో ఓ రిక్షాలో ఆమెను ఇంటికి పంపించారు.
డ్రగ్స్ ఇచ్చి గ్యాంగ్ రేప్
రిక్షాలో ఉన్న తమ కూతురిని చూసి ఆ తల్లిదండ్రులు షాక్ తిన్నారు. ఆమె కాళ్లు,వెన్నెముక విరిగిపోయినట్లు గుర్తించారు. ఆమెపై అత్యాచారం జరిగిందని గుర్తించి వెంటనే ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. కానీ అప్పటికే పరిస్థితి విషమించడంతో ఆమె మృతి చెందింది. తమ కూతురికి డ్రగ్స్ ఇచ్చి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారని బాధితురాలి తల్లిదండ్రులు ఆరోపించారు. రిక్షాలో ఆమె ఇంటికి వచ్చిన సమయంలో... ఆమె నోటి వెంట మాట కూడా రాలేదన్నారు. నొప్పిని భరించలేకపోతున్నానని... ఇక తాను బతకనని ఆమె చెప్పినట్లు వాపోయారు.
నిందితుల అరెస్ట్...
ఈ కేసుకు సంబంధించి బలరాంపూర్ పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. అయితే బాధితురాలు కాళ్లు,వెన్నెముక విరిచేశారన్న ఆరోపణలను ఖండించారు. పోస్టుమార్టమ్ రిపోర్టులో అలాంటిదేమీ బయటపడలేదన్నారు. ఈ ఘటనపై ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్ ట్విట్టర్లో స్పందించారు. హత్రాస్ ఘటన విషయంలో చేసిన తప్పులను ఇక్కడ కూడా చేయవద్దని... నిందితులను వెంటనే పట్టుకుని కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేశారు.
Recommended Video
యూపీలో మహిళలపై ఆగని నేరాలు...
ఇదే ఉత్తరప్రదేశ్లో ఇటీవల మీరట్లో కదులుతున్న బస్సులో ఓ యువతి గ్యాంగ్ రేప్కు గురైంది. రాత్రంగా డ్రైవర్,కండక్టర్ ఆమెపై అత్యాచారానికి పాల్పడి... కదులుతున్న బస్సు నుంచే ఆమెను బయటకు విసిరేశారు. గతవారం హత్రాస్ పట్టణంలోనే మరో దళిత యువతి కూడా కిడ్నాప్కి గురైంది. తల్లితో కలిసి మందులు కొనేందుకు వెళ్లిన యువతి... టెంపో వాహనంలో ఇంటికి బయలుదేరగా మార్గమధ్యలో అస్వస్థతకు గురైంది. దీంతో మంచి నీళ్ల సీసా కొనేందుకు ఆమె తల్లి టెంపో నుంచి దిగి ఓ షాపులోకి వెళ్లగా... వాహన డ్రైవర్ ఆమెను కిడ్నాప్ చేసి తీసుకెళ్లాడు. ఇలా యూపీలో మహిళలపై జరుగుతున్న వరుస అఘాయిత్యాలు అక్కడ మహిళా భద్రతను ప్రశ్నార్థకం చేస్తున్నాయి.