త్వరలో మోడీ ప్రభుత్వం మరో పెద్ద నిర్ణయం!: ఆ చారిత్రాత్మక నిర్ణయం అదేనా?
న్యూఢిల్లీ: కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రైతుల కోసం పెద్ద నిర్ణయం తీసుకోనుందా? రైతులు ఆదాయాన్ని పెంచేందుకు చారిత్రక ప్రకటన చేయనుందా? అంటే అవుననే అంటున్నారు బీజేపీ నేత ఒకరు. బీజేపీ రైతు సంఘం అధ్యక్షులు వీరేంద్ర సింగ్ శుక్రవారం మాట్లాడుతూ.. రైతులకు, గ్రామీణ ప్రాంతానికి, వ్యవసాయ రంగానికి లాభం చేకూరేలా కేంద్రం చారిత్రక నిర్ణయం తీసుకోనుందన్నారు.
గ్రామీణాభివృద్ధి, వ్యవసాయ రంగంలో ప్రభుత్వం ఇప్పటికే అనేక చారిత్రక నిర్ణయాలు తీసుకుందని ఆయన తెలిపారు. రైతుల సమస్యలకు రుణమాఫీ శాశ్వత పరిష్కారం కాదని ఆయన అన్నారు. అందుకే రైతుల శ్రేయస్సు, అభివృద్ధి కోసం కేంద్రం త్వరలోనే పెద్ద నిర్ణయం తీసుకోనుందన్నారు.
దేశవ్యాప్తంగా రైతులకు పెట్టుబడి కింద ఏటా కొంత మొత్తం చెల్లించాలని కేంద్ర ప్రభుత్వం యోచనలో ఉన్నట్లు గత కొంతకాలంగా ఊహాగానాలు వెలువడుతున్నాయి. అయితే వీటిపై ప్రభుత్వం నుంచి ఇంత వరకు స్పష్టత రాలేదు. తాజాగా వీరేంద్ర సింగ్ వ్యాఖ్యలతో మరోసారి ఈ అంశం ప్రాధాన్యత సంతరించుకుంది. లోకసభ ఎన్నికల ముందే కేంద్రం ఈ నిర్ణయం ప్రకటించే అవకాశముంది.
నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే సంచలన నిర్ణయాలు తీసుకున్నది. నోట్ల రద్దు, జీఎస్టీ వంటి చారిత్రక నిర్ణయాలు తీసుకుంది. జీఎస్టీతో సామాన్యులకు ఊరట లభించిందని అంటున్నారు. ఆ తర్వాత జీఎస్టీలో 28 శాతం స్లాబ్లో ఉన్న వాటిని కూడా క్రమంగా తక్కువ స్లాబ్లోకి వేస్తూ ప్రజలకు ఊరట కల్పిస్తున్నారు.