కరోనా డేంజర్ బెల్స్ : దేశంలో 10కి చేరిన మృతుల సంఖ్య.. ఈశాన్య రాష్ట్రాల్లో తొలి పాజిటివ్ కేసు
దేశంలో కరోనా వైరస్ మృతుల సంఖ్య 10కి పెరిగింది. ముంబైలో 65ఏళ్ల ఓ వ్యక్తి కరోనా బారినపడి మంగళవారం(మార్చి 24)న మృతి చెందాడు. మహారాష్ట్రలో ఇది మూడో కరోనా మృతి కావడం గమనార్హం. మృతుడు ఇటీవలే సౌదీ నుంచి అహ్మదాబాద్ వచ్చాడు. కొద్దిరోజులకు అతనిలో జ్వరం,దగ్గు,శ్వాస సమస్యలు బయటపడ్డాయి. ఈ నేపథ్యంలో మార్చి 20న అతన్ని ముంబైలోని కస్తూర్బా ఆసుపత్రికి తీసుకొచ్చారు. అప్పటికే అతని ఆరోగ్య పరిస్థితి విషమించినప్పటికీ వైద్యులు తమ శాయశక్తులా ప్రయత్నించారు. చివరకు మంగళవారం అతను తుది శ్వాస విడిచాడు.
మృతుడికి డయాబెటీస్,బీపీతో పాటు ఇతర ఆరోగ్య సమస్యలు కూడా ఉన్నాయని వైద్యులు వెల్లడించారు. ఇక ఇప్పటిదాకా ఒక్క కేసు కూడా నమోదు కానీ ఈశాన్య రాష్ట్రాల్లో.. తాజాగా మొదటి పాజిటివ్ మణిపూర్లో నమోదైంది. పాజిటివ్గా తేలిన మహిళ ఇటీవలే బ్రిటన్ నుంచి తిరిగొచ్చినట్టు జవహర్లాల్ నెహ్రూ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ డైరెక్టర్ భీమో సింగ్ తెలిపారు. బ్రిటన్ నుంచి మొదట ఆమె ఢిల్లీకి చేరుకుందని.. అక్కడినుంచి గువాహటి ఎయిర్పోర్టులో దిగి ఇంఫాల్కి వచ్చిందని తెలిపారు.
ఇప్పటివరకు దేశవ్యాప్తంగా దాదాపు 500 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.వీటిల్లో అత్యధికంగా 97 కేసులు కేరళలో నమోదవగా.. 87 కేసులు మహారాష్ట్రలో నమోదయ్యాయి. కర్ణాటకలో 37,తెలంగాణలో 36, ఉత్తరప్రదేశ్లో 33 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మొత్తం 10 మంది కరోనా బారినపడి మృతి చెందగా.. అందులో ముగ్గురు మహారాష్ట్రలో,పశ్చిమ బెంగాల్,హిమాచల్ ప్రదేశ్,బీహార్,కర్ణాటక,గుజరాత్,పంజాబ్ రాష్ట్రాల్లో ఒక్కొక్కరు మృతి చెందారు. కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండటంతో ఇప్పటికే 23 రాష్ట్రాలు పూర్తి లాక్ డౌన్ ప్రకటించాయి. ఈ నేపథ్యంలో మంగళవారం రాత్రి 8గంటలకు మరోసారి జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్న ప్రధాని నరేంద్ర మోదీ కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది.