ఢిల్లీలోని ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం..పేలుడు: శిథిలాల కింద చిక్కుకున్న పలువురు
న్యూఢిల్లీ: ఓ వైపు తీవ్రమైన చలి ఢిల్లీని వణికిస్తుండగా మరోవైపు వరుస అగ్ని ప్రమాదాలు కూడా వణికిస్తున్నాయి. కొద్ది రోజుల క్రితం ఢిల్లీలో చోటుచేసుకున్న అగ్ని ప్రమాద ఘటన మరువక ముందే తాజాగా పీరాగర్హిలోని ఓ బ్యాటరీ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటన గురువారం ఉదయం చోటుచేసుకుంది. అగ్నిప్రమాదం సంభవించిన వెంటనే సహాయక చర్యలు చేపడుతుండగా ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించింది. దీంతో ఫ్యాక్టరీ భవంతి కుప్పకూలింది.
I hope and pray that no life is lost. #udyogvihar #industrial #peeragarhi #fire pic.twitter.com/JDOBmdTpk7
— Mehar Bhagat (@MeharBhagat) January 2, 2020
శిథిలాల కింద చాలామంది ఉన్నట్లు భావిస్తున్నారు. ఇందులో సహాయక చర్యలు చేపడుతున్న ఫైర్ సిబ్బంది కూడా ఉన్నట్లు సమాచారం. సోషల్ మీడియాలో ఘటనకు సంబంధించిన వీడియో ప్రత్యక్షమైంది. ప్రమాదం జరిగిన స్థలం నుంచి భారీగా ఎగిసి పడిన దృశ్యాలు ఈ వీడియోలో కనిపిస్తున్నాయి. రోహతక్ రోడ్డులో భారీగా ఫైరింజన్లు ఉన్న దృశ్యాలు కనిపిస్తున్నాయి.
గురువారం ఉదయం 4:23 గంటలకు ఫైర్ సిబ్బందికి అగ్నిప్రమాదంపై సమాచారం అందింది. ఉద్యోగ్నగర్లోని పీరాగర్హి ప్రాంతంలో ఉన్న ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం సంభవించిందని సమాచారం వచ్చింది. వెంటనే అక్కడికి ఫైర్ సిబ్బంది ఫైర్ ఇంజిన్లతో బయలుదేరారు. అయితే సహాయక చర్యలు చేపడుతుండగానే పేలుడు సంభవించడంతో భవనం కూలింది.
మొత్తం 35 ఫైర్ ఇంజిన్లు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపడుతున్నాయి. అంతేకాదు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా చేరుకుని రెస్క్యూ ఆపరేషన్స్ నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు ప్రాణహాని జరిగినట్లు ఎలాంటి అధికారిక సమాచారం అందలేదు. అయితే చాలామందికి గాయాలైనట్లు తెలుస్తోంది. గాయపడిన వారిని దగ్గరలోని హాస్పిటల్కు చికిత్స కోసం తరలించారు. బ్యాటరీల లీకేజీతోనే పేలుడు సంభవించిందని అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. ఘటనపై విచారం వ్యక్తం చేశారు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. విచారణకు ఆదేశించామని చెప్పిన ఆయన.. సహాయక చర్యలు వేగవంతం అయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఘటనపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Peeragarhi factory fire: Rescue operation by NDRF and Fire brigade personnel underway. #Delhi pic.twitter.com/YgwarQS094
— ANI (@ANI) January 2, 2020