సాంకేతిక లోపం: 180 ప్రయాణికులతో వెళ్లిన ఇండిగో ఎయిర్బస్ రిటర్న్
కోల్కతా: మరో ఇండిగో విమానానికి పెను ప్రమాదం తప్పింది. 180 మంది ప్రయాణికులతో సిలిగురి నుంచి కోల్కతా బయలుదేరిన ఇండిగో విమానం సాంకేతిక సమస్యతో టేకాఫ్ అయిన కాసేపటికే సిలిగురిలోని బదోగ్రా విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యింది.
సోమవారం మధ్యాహ్నం 12.30గంటలకు ఈ విమానం టేకాఫ్ అయ్యింది. విమానం ఇంజిన్లో సమస్య తలెత్తడంతో కొద్దిసేపటికే వెనుతిరిగి సురక్షితంగా ల్యాండ్ అయ్యింది. ఇండిగో ఎయిర్ బస్ ఏ320 నియోలో తరచూ ఇంజిన్లో సాంకేతిక సమస్యలు తలెత్తుతుండటంతో ప్రయాణికుల్లో ఆందోళన నెలకొంది.
ఇదే ఇంజిన్ వాడుతున్న పలు ఇండిగో విమానాలు ఇటీవల తరచూ ఇలాంటి సమస్యతోనే ల్యాండ్ అవడం గమనార్హం. ఈ క్రమంలో వచ్చే ఏడాది జనవరి 31 నాటికి ఇండిగో తన ఎయిర్బస్ ఏ320 నియో విమానాల ఇంజిన్లను సవరించాలని పౌర విమానయాన డైరెక్టరేట్ జనరల్(డీజీసీఏ) ఆదేశాలు జారీ చేసింది.
కాగా, ఈ ఇంజిన్ వేరియంట్ను అమెరికాకు చెందిన ప్రాట్ అండ్ వైట్నీ కంపెనీ తయారు చేస్తోందని తెలిసింది. ఇండిగో పోటీదారు అయిన గోఎయిర్ కూడా ఈ కంపెనీకి చెందిన ఇంజిన్లనే వాడుతుండటంతో ఆ సంస్థ విమానాలు కూడా ఇదే సమస్యను ఎదుర్కొంటుండటం గమనార్హం. తక్కువ ధరకే ఇంజిన్లను అందించడంతో విమానయాన సంస్థలు ఈ కంపెనీ వైపు మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది.