ఇండిగో మరో‘సారీ’: వీల్చైర్ నుంచి కిందపడిన పెద్దావిడ, గాయాలు
న్యూఢిల్లీ: ఇప్పటికే విమర్శలు ఎదుర్కొంటున్న ఇండిగో ఎయిర్లైన్స్ మరో వివాదం తెచ్చుకుంది. ఇటీవల ఢిల్లీలో ఓ ప్రయాణికుడిపై తమ సిబ్బంది దాడి చేసినందుకు ఇండిగో క్షమాపణ చెప్పిన సంగతి తెలిసిందే. తాజాగా శనివారం ఓ పెద్దావిడ వీల్చైర్లో నుంచి కిందపడి గాయపడటంతో ఆ సంస్థ మరోసారి క్షమాపణలు చెప్పుకోవాల్సి వచ్చింది.
వివరాల్లోకి వెళితే.. లక్నో విమానాశ్రయంలో ఇండిగో సిబ్బంది ఊర్వశి పారిఖ్ విరేన్ అనే ప్రయాణికురాలిని వీల్చైర్లో తీసుకెళుతుండగా ఆమె కిందపడిపోయారు. దీంతో ఇండిగో ఎయిర్ లైన్స్ సిబ్బందిపై మరోసారి విమర్శలు వచ్చాయి.
ఇండిగో సిబ్బంది పైశాచికం: ప్రయాణికుడిపై కిందపడేసి దాడి(వీడియో)
ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రి ఇండిగో విమానయాన సంస్థ ఈ ఘటనపై స్పందించింది. 'నిన్నరాత్రి 8 గంటలకు లక్నో విమానాశ్రయంలో జరిగిన ఈ దుర్ఘటనపై ఊర్వశి పారిఖ్కు క్షమాపణ తెలుపుతున్నాం' అని పేర్కొంది.
'రాత్రిపూట కావడంతో అక్కడ వెలుతురు సరిగా లేకపోవడం, తారురోడ్డుపై గుంతపడడం వల్ల వీల్చైర్ బ్యాలెన్స్ తప్పిపోయింది. దీంతో ఆమె కిందపడి గాయపడ్డారు. మా సిబ్బంది వెంటనే ఆమెను ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా వైద్యుడి వద్దకు తీసుకెళ్లి వైద్యం అందించారు. ప్రథమ చికిత్స చేసిన తర్వాత ఆమె కోలుకున్నారు' అని ఇండిగో వివరించింది. అంతేగాక, ఇందులో మానవ తప్పిదం లేదని ఊర్వశి చెప్పినట్టు ఇండిగో పేర్కొంది.