అశోక్ గెహ్లాట్కు మరో పరీక్ష- అవిశ్వాస తీర్మానానికి బీజేపీ ప్లాన్- పైలట్ రాకతో సానుకూలత..
నిన్న మొన్నటి వరకూ ఇంటిపోరుతో సతమతమైన రాజస్ధాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్కు ఇప్పుడు బీజేపీ రూపంలో మరో పోరు మొదలైంది. అధికార కాంగ్రెస్లో విభేదాలను సొమ్ము చేసుకునేందుకు విఫలయత్నం చేసిన విపక్ష బీజేపీ ఇప్పుడు అవిశ్వాసం పేరుతో మరో నాటకానికి తెరదీసింది. తిరుగుబాటు నేత సచిన్ పైలట్ రాకతో పటిష్టంగా కనిపిస్తున్న కాంగ్రెస్ పార్టీ దీన్ని అనాయాసంగా ఎదుర్కొంటుందా లేక విభేదాలు ఇంకా తొలగిపోలేదని నిరూపిస్తుందా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
గెహ్లాట్ సర్కారుపై అవిశ్వాసం..
రాజస్ధాన్లో సీఎం అశోక్ గెహ్లాట్ కష్టాలు ఇప్పట్లో తీరేలా కనిపించడం లేదు. ఇప్పటికే సచిన్ పైలట్ తిరుగుబాటుతో మొదలైన కష్టాల పర్వాన్ని కొనసాగిస్తూ గెహ్లాట్ ప్రభుత్వంపై మరో యుద్ధం చేసేందుకు విపక్ష బీజేపీ సిద్దమవుతోంది. పైలట్ కాంగ్రెస్కు తిరిగి రావడంతో బలంగా కనిపిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇంకా లుకలుకలు ఉన్నాయని నిరూపించేందుకు అవిశ్వాస తీర్మానాన్ని బీజేపీ అస్త్రంగా ఎంచుకుంది. తద్వారా ఒకరిద్దరు అసంతృప్త నేతలపై గాలం వేయాలనేది కాషాయ నేతల ఆలోచనగా కనిపిస్తోంది. రేపు ఉదయం అసెంబ్లీ సమావేశం కాగానే అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడతామని విపక్ష నేత గులాబ్ చంద్ కటారియా ప్రకటించారు.
పైలట్ రాకతో పటిష్గంగా కాంగ్రెస్..
తిరుగుబాటు నేత సచిన్ పైలట్తో అధిష్టానం చర్చలు జరిపి తిరిగి కాంగ్రెస్ గూటికి చేర్చడంతో ఇప్పుడు రాజస్ధాన్ ప్రభుత్వం పటిష్టంగానే కనిపిస్తోంది. గతంలో తిరుగుబాటుకు ప్రయత్నించిన 18 మంది ఎమ్మెల్యేలను తిరిగి సొంత గూటికి చేర్చడంతో ప్రభుత్వ మనుగడకు ముప్పులేదని కాంగ్రెస్ పార్టీ ధీమాగా ఉంది. అయితే పైలట్ రాక తర్వాత కూడా ఇంకెవరైనా అసమ్మతి నేతలు ఉన్నారా అన్నదానిపైనా ఆరా తీస్తున్నారు. బీజేపీ అవిశ్వాస తీర్మానం అస్త్రం ప్రయోగించడం వెనుక కాంగ్రెస్ పార్టీ నేతల నుంచి సహకారం అందుతోందా అన్న కోణంలో సీఎం గెహ్లాట్ వివరాలు సేకరిస్తున్నారు. ప్రస్తుత పరిస్ధితుల్లో పైలట్ రాకతో ప్రభుత్వ మనుగడకు ఎలాంటి ముప్పు ఉండకపోవచ్చని భావిస్తున్నారు.
అసంతృప్తులపై బీజేపీ ఆశలు..
సచిన్ పైలట్ తిరిగి కాంగ్రెస్ గూటికి చేరిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తిరిగి పటిష్టంగా మారిందని భావిస్తున్న తరుణంలో విపక్ష బీజేపీ నేతలు అవిశ్వాసానికి తెరలేపడంపై పలు ఆనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ పటిష్టంగా ఉంటే అవిశ్వాసం ఎదుర్కోవచ్చు కదా అంటూ బీజేపీ నేతలు కవ్వింపు చర్యలకు దిగుతున్నారు. ప్రభుత్వం ఎంతో కాలం సాగదంటూ మాజీ సీఎం వసుంధరా రాజే వంటి నేతలు చేస్తున్న ప్రకటనలతో పరిస్ధితి వేడెక్కింది. అయితే రాడనుకున్న పైలట్ తిరిగి కాంగ్రెస్ గూటికి చేరడంతో దెబ్బతిన్న తమ ప్రతిష్టను పునరుద్ధరించుకునే క్రమంలో బీజేపీ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడుతోందన్న అంచనాలున్నాయి.