కోవిడ్ 19 హాట్స్పాట్గా మారిన మరో లగ్జరీ హోటల్: 20 ఉద్యోగులకు కరోనా పాజిటివ్
చెన్నై: తమిళనాడు రాజధాని చెన్నైలోని లగ్జరీ హోటళ్లు కరోనా వ్యాప్తి కేంద్రాలుగా మారుతున్నాయి. రెండ్రోజుల క్రితం ఓ లగ్జరీ హోటళ్లోని 85 మందికి కరోనా సోకినట్లు తేలగా.. తాజాగా, మరో లగ్జరీ హోటళ్లో 20 మంది ఉద్యోగులకు కరోనా ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. దీంతో ఆ హోటల్ కూడా కోవిడ్ క్లస్టర్గా మారిపోయింది.
చెన్నైలోని లీలా ప్యాలెస్ హోటల్లో 20 మంది ఉద్యోగులకు కరోనా సోకింది. డిసెంబర్ 31 నుంచి జనవరి 2 మధ్య వీరికి కరోనా పరీక్షలు నిర్వహించగా కరోనా సోకినట్లు తేలింది. మరికొందరికి కూడా కరోనా లక్షణాలు ఉండటంతో వారిని ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఈ క్రమంలో నగరంలోని అన్ని హోటళ్లు, ఇతర ప్రజలు రద్దీగా ఉండే షాపింగ్ మాల్స్, థియేటర్స్ లాంటి ప్రాంతాల్లో కరోనా నిబంధనలను కఠినంగా అమలు చేయాలని సంస్థల యాజమాన్యాలకు అధికారులు స్పష్టం చేశారు.
డిసెంబర్ 15 నుంచి చెన్నై గైండీలోని ఐటీసీ గ్రాండ్ ఛోళా హోటళ్లో 85 మంది సిబ్బందికిపైగా కరోనా బారినపడటంతో నగరంలోని అన్ని హోటళ్లలోనూ అధికారులు పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఐటీసీ గ్రాండ్ ఛోళాలో మొత్తం 609 మంది నమూనాలను పరీక్షించగా.. 85 మందికి కరోనా ఉన్నట్లు గుర్తించారు.
ఈ నేపథ్యంలోనే లీలా ప్యాలెస్లోని ఉద్యోగులను, సిబ్బందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. అంతేగాక, హోటల్ కు వచ్చిన అతిథులకు కూడా పరీక్షలు నిర్వహించాలని గ్రేటర్ చెన్నై కార్పొరేషన్ ఆదేశాలు జారీ చేసింది.
ఐటీసీ గ్రాండ్ ఛోళాలో అన్ని కార్యక్రమాలను నిబంధనల ప్రకారమే నిర్వహించామని ఆ సంస్థ యాజమాన్యం తెలిపింది. 50 శాతం హాలును భౌతిక దూరం పాటించేందుకు అనువుగా ఉపయోగించామని పేర్కొంది. డిసెంబర్ 15న ఒక చెఫ్ కరోనా బారినపడటంతో వైరస్ వ్యాప్తి జరిగిందని తెలుస్తోంది.
తమ సిబ్బందికి క్రమం తప్పకుండా కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నామని, అతిథుల క్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని అన్ని చర్యలు తీసుకుంటున్నామని ఐటీసీ గ్రాండ్ ఛోళా యాజమాన్యం తెలిపింది. అవసరమైన సమాచారాన్ని అధికారులతో పంచుకున్నామని వెల్లడించింది.
ఎప్పటికప్పుడు తాము హోటల్లో శానిటైజ్ చేస్తున్నామని, ప్రభుత్వ నిబంధనలను కఠినంగా అమలు చేస్తున్నామని తెలిపింది. కాగా, హోటల్ సమీపంలోని ప్రజలను కూడా కరోనా టెస్టులు చేయించుకోవాలని చెన్నై కార్పొరేషన్ కోరింది. కాగా, ఇటీవల ఐఐటీ మద్రాసులో 200 మంది విద్యార్థులకు కరోనా సోకిన విషయం తెలిసిందే.