ఆన్లైన్ న్యూస్ పోర్టల్స్ పై కేంద్రం నిఘా..రాష్ట్రపతి గెజిట్: అశ్లీలంపై కొరడా..!
న్యూఢిల్లీ: ఇప్పటి వరకు ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియాలు మాత్రమే కేంద్ర సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ కిందకు వచ్చేవి. తాజాగా డిజిటల్ మీడియా లేదా ఆన్లైన్ మీడియాను కూడా దీనికిందకు చేరుస్తూ కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. డిజిటల్ మీడియా లేదా ఆన్లైన్ మీడియా, సినిమాలు మరియు ఆడియో విజువల్ ప్రోగ్రామ్స్, వార్తలు, కరెంట్ అఫెయిర్స్ కంటెంట్ ఉన్నటువంటి ఆన్లైన్ పోర్టల్స్ను కేంద్ర సమాచారం మరియు ప్రసారాల మంత్రిత్వ శాఖ కిందకు తీసుకొస్తున్న కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ప్రస్తుతం ఈ డిజిటల్ కంటెంట్ లేదా ఆన్లైన్ మీడియాను పర్యవేక్షించేందుకు చట్టం లేదా స్వయంప్రతిపత్తి కలిగిన సంస్థలు లేవు. అయితే ఇప్పుడు వీటిని ఇన్ఫర్మేషన్ మరియు బ్రాడ్ క్యాస్టింగ్ మంత్రిత్వ శాఖ కిందకు చేరుస్తూ రాష్ట్రపతి సంతకం చేసిన గెజిట్ను కేంద్రం విడుదల చేసింది. ప్రస్తుతం ప్రింట్ మీడియాను పర్యవేక్షించేందుకు ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఉండగా, న్యూస్ ఛానెల్స్ను మానిటర్ చేసేందుకు న్యూస్ బ్రాడ్క్యాస్టర్స్ అసోసియేషన్ (ఎన్బీఏ) ఉంది. సినిమాలను పర్యవేక్షించేందుకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ (సీబీఎఫ్సీ) ఉండగా అడ్వర్టయిజ్మెంట్లను పర్యవేక్షించేందుకు అడ్వర్టయిజింగ్ స్టాండర్డ్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఉందని పేర్కొంది.
మీడియా స్వతంత్రతను అణిచివేసే నిర్ణయాలు కానీ ఇతరత్ర చర్యలు కానీ మోడీ ప్రభుత్వం ఎప్పటికీ తీసుకోబోదని 2019లోనే ఇప్పటి కేంద్ర సమాచార మరియు ప్రసారాల శాఖ మంత్రి ప్రకాష్ జవడేకర్ చెప్పారు. అంతేకాదు ఆన్లైన్ మీడియా లేదా ఓటీటీ ప్లాట్ఫాంలపై కూడా నియంత్రణ ఉంటే బాగుంటుందని భావించారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా, సినిమాలకు ఎలాగైతే ఒక సంస్థ పర్యవేక్షిస్తోందో అలాంటి పర్యవేక్షణ కూడా డిజిటల్ మీడియాకు ఉండాలని నాడు చెప్పారు.
Recommended Video
ఇప్పటి వరకు ఆన్లైన్ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్స్ కంటెంటె ప్రొవైడర్లు ఎలాంటి సంస్థల పర్యవేక్షణలో లేవు. దీంతో సెన్సార్ బోర్డు తీసుకొచ్చిన నిబంధనలు వీటికి వర్తించకపోవడంతో కొన్ని ఆన్లైన్ సంస్థలు హద్దులు మీరుతున్నాయనే అంశం కేంద్రం దృష్టికి వచ్చింది. దీంతో డిజిటల్ మీడియాను కూడా పర్యవేక్షించాలని భావించి దీన్ని ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్ క్యాస్టింగ్ మినిస్ట్రీ కిందకు చేర్చింది కేంద్ర ప్రభుత్వం.