'రాజీవ్ గాంధీ తరహా': ప్రధాని నరేంద్ర మోడీ హత్యకు మావోయిస్టుల కుట్ర
పుణే: ప్రధాని నరేంద్ర మోడీ హత్యకు మావోయిస్టులు భారీ కుట్ర చేశారు. అయితే దీనిని పోలీసులు ముందే భగ్నం చేశారు. మావోయిస్టులకు సంబంధించిన లేఖ ద్వారా ఈ కుట్రను పుణే పోలీసులు గుర్తించారు. రాజీవ్ గాంధీ తరహా హత్యకు మావోయిస్టులు ప్లాన్ చేశారు.
ప్రధాని నరేంద్ర మోడీ హత్య, భారత దేశం ముక్కలు కావడం ఖాయం: హఫీజ్ అనుచరుడు
ప్రధాని నరేంద్ర మోడీని హతమార్చే ప్రయత్నాల్లో మావోయిస్టులు ఉన్నారంటూ పూణె పోలీసులు శుక్రవారం ఓ కుట్రను బయటపెట్టారు. నిషేధిత మావోయిస్టు పార్టీతో సంబంధాలు కలిగి ఉన్న అయిదుగురిని తాము బుధవారం అదుపులోకి తీసుకోగా, వీరిలో ఒకరి నివాసం నుంచి ఓ లేఖను సీజ్ చేశామని పోలీసులు స్థానిక సెషన్స్ కోర్టుకు నివేదించారు.
దీని ఆధారంగా ప్రధాని మోడీని రాజీవ్ గాంధీ హత్య తరహాలో అంతమొందించే ఆలోచనలో మావోయిస్టులు ఉన్నట్టు తెలుస్తోందని పేర్కొన్నారు. పోలీసులు అరెస్ట్ చేసిన అయిదుగురు ముంబైకి చెందిన సుధీర్ ధవాలే, ఢిల్లీకి చెందిన రోనా జాకబ్, నాగపూర్కు చెందిన న్యాయవాది సురేంద్ర గండ్లింగ్, షోమా సేన్, మహేష్ రావత్.
వీరిని పుణే సెషన్స్ కోర్టులో ప్రవేశ పెట్టారు. ఈ నెల 14వ తేదీ వారిని పోలీసు కస్టడీకి అనుమతించింది. నిందితుల్లో రోనాజాకబ్ నివాసం నుంచి లేఖను స్వాధీనం చేసుకున్నట్టు ప్రాసిక్యూటర్ ఉజ్వల్ పవార్ కోర్టుకు తెలిపారు. అందులో ఎం 4 రైఫిల్, నాలుగు లక్షల రౌండ్లను కొనుగోలు చేసేందుకు రూ.8 కోట్లు అవసరమని పేర్కొన్నారు.
దీంతో పాటు, రాజీవ్ గాంధీ హత్య తరహా ఘటన గురించి ప్రస్తావన ఉందని కోర్టు దృష్టికి తెచ్చారు. ప్రధాని మోడీ పేరును ప్రస్తావించకుండా మరో రాజీవ్ గాంధీ ఘటన తరహాలో ఆలోచిస్తున్నట్టు నివేదించారు. అయితే, ప్రాసిక్యూషన్ వాదనలను, ప్రవేశపెట్టిన పత్రాలను అవాస్తవాలు అని డిఫెన్స్ న్యాయవాది అన్నారు.