అత్యాచార భారతం: మైనర్ బాలికపై సామూహిక అత్యచారం..నిందితుడిని కొట్టి చంపిన బంధువులు
రాజస్థాన్లో కొద్దిరోజుల క్రితం ఓ దళిత మహిళపై సామూహికత అత్యచారం జరిగిన ఘటన మరువకముందే మరో ఘటన వెలుగు చూసింది. అల్వార్లో ఓ 15 ఏళ్ల చిన్నారిపై గుర్తుతెలియని వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఇక మొత్తానికి ఆ రాష్ట్రంలో ముగ్గురు మైనర్ బాలికలపై అత్యచారాలు జరిగిన ఘటనలు బయటపడ్డాయి. దీంతో ఆ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ నేతలు ఇతర సామాజిక కార్యకర్తలు మండిపడ్డారు.
అత్యాచారం చేసిన నిందితుడిని చితకబాదటంతో మృతి
అల్వార్లో 15 ఏళ్ల చిన్నారి తమ బంధువుల పెళ్లికి వెళ్లిన సమయంలో ముగ్గురు మైనర్ బాలురులు ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఇందులో ఒకరు తప్పించుకోగా... మిగతా ఇద్దరిని బాధితురాలి తల్లిదండ్రులు పట్టుకున్నారు. మరుసటి రోజు ఉదయం వారిని చితకబాదినట్లు అల్వార్ ఎస్పీ తెలిపారు. చితకబాదిని కొన్ని గంటల తర్వాత ఇద్దరిలో ఒక బాలుడు రోడ్డుపక్కన శవమై కనిపించాడు. మైనర్ బాలిక తల్లిదండ్రులు, మృతి చెందిన బాలుడి తల్లిదండ్రులు వేర్వేరుగా ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. బాధితురాలి సోదరుడిపై హత్యకేసు నమోదు చేశారు.
జువైనల్ హోంకు నిందితుల తరలింపు
మే 14న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. ఇక తప్పించుకుని పారిపోయిన మరో బాలుడిని కూడా పోలీసులు పట్టుకున్నారు.ఇద్దరిని కోర్టులో ప్రవేశపెట్టగా .... మే 29 వరకు జువైనల్ హోమ్లో ఉంచాల్సిందిగా న్యాయమూర్తి ఆదేశించారు. చురులో జరిగిన మరో అత్యాచార ఘటనలో ఆరేళ్ల బాలికపై ఆమె సొంత బంధువే అయిన 14 ఏళ్ల కుర్రాడు అత్యాచారానికి పాల్పడ్డాడు. నీళ్లు తెచ్చేందుకు బాలిక వెళుతుండగా ఆ చిన్నారిని ఒక నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. అతన్ని భానిపురా పోలీసులు అరెస్టు చేశారు. ధోల్ పూర్లో జరిగిన మరో ఘటనలో ఎనిమిదేళ్ల చిన్నారిపై 18 ఏళ్ల యువకుడు అత్యాచారం చేశారు. అతన్ని పర్వేష్గా పోలీసులు గుర్తించారు. శనివారం అతన్ని పోలీసులు పట్టుకున్నారు.
కాంగ్రెస్పై దుమ్మెత్తి పోసిప బీజేపీ
ఒకేసారి మూడు ఘటనలు బయటపడటంతో బీజేపీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసింది. ఇది కాస్త రాజకీయ రంగు పులుముకుంది. రాజస్థాన్లో అమ్మాయిలపై జరుగుతున్న అత్యాచారాల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోందని రాష్ట్రంలో మహిళలకు భద్రత కరువవుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మదన్ లాల్ సైనీ ధ్వజమెత్తారు. ప్రభుత్వం నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని అదే సమయంలో సమాజం కూడా బాధ్యతతో వ్యవహరించి అత్యాచారాలకు పాల్పడుతున్న వారిని వెలివేయాలని కోరింది.
ఇదిలా ఉంటే అల్వార్ గ్యాంగ్ రేప్లో ఆరుగురిపై ఎస్సీ ఎస్టీ కోర్టులో చార్జ్షీట్ దాఖలు చేయడం జరిగిందని అడిషనల్ ఎస్పీ చిరంజీలాల్ తెలిపారు. భర్తముందే ఐదుగురు ఓ దళిత మహిళపై సామూహిక అత్యచారానికి ఏప్రిల్ 26న పాల్పడ్డారు. మరొకరు ఈ ఘటనను వీడియో రికార్డింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు.