ఈశాన్యంలో కమల వికాసం... అసోంలో మెజార్టీ స్థానాలు బీజేపీవేనంటున్న ఎగ్జిట్ పోల్స్
సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో బీజేపీ మరోసారి ప్రభంజనం సృష్టిస్తుందని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. ఉత్తర్ప్రదేశ్ మినహా పలు రాష్ట్రాల్లో ఆ పార్టీ బలాన్ని మరింత పెంచుకుంటుందని అంచనా వేశాయి. ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాల్లో కమలదళం పునాదులు మరింత బలపడతాని ఎగ్జిట్ పోల్ అంచనాలను బట్టి తెలుస్తోంది. ఈశాన్య రాష్ట్రాల్లో మొత్తం 25 లోక్సభ స్థానాలుండగా.. వాటిలో అసోం వాటా 14. అయితే ఈసారి ఎన్నికల్లో అసోంలో బీజేపీ మిత్రపక్షాలు భారీగా లబ్ది పొందుతాయని ఎగ్జిట్ పోల్ అంచనాలు చెబుతున్నాయి.
ఈవీఎంల కుట్ర మొదలైందంటూ ఎగ్జిట్ పోల్స్ పై మమత షాకింగ్ కామెంట్
2014లో అసోంలోని 14 స్థానాల్లో బీజేపీ 7సీట్లు తన ఖాతాలో వేసుకోగా.. కాంగ్రెస్ 3, ఏఐయూడీఎఫ్ 3, ఒక స్థానంలో ఇండిపెండెంట్ అభ్యర్థి గెలుపొందారు. తాజాగా వెలువడిన ఎన్డీటీవీ ఎగ్జిట్ పోల్ అంచనాల ప్రకారం అసోంలో ఎన్డీఏ 9సీట్లు ఖాతాలో వేసుకుంటుందని, కాంగ్రెస్ 4, ఒక స్థానాన్ని ఇండిపెండెంట్లు గెల్చుకోనున్నారు.
టైమ్స్నౌ - వీఎంఆర్ ఎగ్జిట్ పోల్ ప్రకారం కాంగ్రెస్ - ఏఐయూడీఎఫ్ కూటమి 7సీట్లు గెలుచుకోనుండగా.. బీజేపీ ఆరు స్థానాల్లో విజయం సాధించనుంది. ఇతరులు ఒక సీటులో గెలవనున్నారు. టుడేస్ చాణక్య ప్రకారం బీజేపీ కూటమి 10సీట్లు, కాంగ్రెస్ 3, ఇతరులు ఒక స్థానాన్ని కైవసం చేసుకోనున్నాయి. అసోంలో ఎన్డీయే కూటమి 8.10 సీట్లు గెలుచుకుంటాయని, కాంగ్రెస్ 2-4, ఏఐయూడీఎఫ్ 2 స్థానాల్లో విజయం సాధిస్తుందని సీఎన్ఎన్ న్యూస్ 10 ఎగ్జిట్ పోల్ ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. అసోంతో పాటు మిగతా ఈశాన్య రాష్ట్రాల్లోనూ బీజేపీ సత్తా చాటుతుందని పలు ఎగ్జిట్ పోల్ సర్వేలు చెబుతున్నాయి.