విచారణ వాయిదా: శ్రీనివాసన్కు మరో ఎదురు దెబ్బ
న్యూఢిల్లీ: భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) మాజీ అధ్యక్షుడు శ్రీనివాసన్కు మరో ఎదురుదెబ్బ తగలేలా ఉంది. సెప్టెంబర్ 29న చెన్నైలో జరగనున్న బీసీసీఐ వార్షిక సాధారణ సమావేశానికి అధ్యక్షత వహించాలనుకుంటున్న శ్రీనివాసన్ ఆశలు నెరవెరేలా లేవు. బీసీసీఐ, బీహార్ క్రికెట్ అసోసియేషన్ల మధ్య వాదనలను వినేందుకు కేసు విచారణను గురువారం సుప్రీం కోర్టు వాయిదా వేసింది.
ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ విచారణకు వేసిన కమిటీ నియామకం చెల్లదంటూ బొంబాయి హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ బీసీసీఐ సుప్రీం కోర్టులో పిటిషన్ వేసిన విషయం తెలిసిందె. రెండు వారాల తర్వాత పిటిషన్పై వాదనలు వింటామని ధర్మాసనం తెలిపింది. అయితే ఏ తేదీన విచారణకు స్వీకరించేది ధర్మాసనం ప్రకటించలేదు.
మళ్లీ ఎప్పుడు విచారిస్తారన్న దానిపై నిర్ణయం కోర్టు ప్రకటిస్తుందని బీసీసీఐ తరపు న్యాయవాది తెలిపారు. దీంతో సెప్టెంబర్ 29న జరిగే సమావేశానికి అధ్యక్షత వహించాలనుకుంటున్న శ్రీనివాసన్కు ఆ అవకాశం లేకుండా పోయింది. ఇది ఇలా ఉండగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి సంబంధించిన అవినీతి కేసులో శ్రీనివాసన్పై సీబీఐ ఛార్జీషీటు దాఖలు చేసింది. ఛార్జీషీటులో ఇండియా సిమెంట్స్ మేనేజింగ్ డైరెక్టర్గా శ్రీనివాసన్ పేరు ప్రస్తావించడం జరిగింది.
శ్రీనివాసన్ అల్లుడు, చెన్నై సూపర్ కింగ్స్ ప్రిన్సిపాల్ గుర్నాథ్ మాయప్పన్, రాజస్థాన్ రాయల్స్ జట్టు సహ యజమాని రాజ్ కుంద్రాలపై వచ్చిన ఆరోపణలపై ఎలాంటి ఆధారాలు లేవని గతంలో బీసీసీఐ వేసిన కమిటీ ప్రకటించిన విషయం విధితమే. కాగా బాంబే హైకోర్టులో కూడా జులై 4న శ్రీనివాసన్ పిటిషన్ దాఖలు చేశాడు. ఐపీఎల్లో జరిగిన అవినీతి ఆరోపణలు నుంచి బయటిపడిన వెంటనే బీసీసీఐలో తన పదవిని పొందడానికి అనుమితివ్వాలని పిటిషన్లో శ్రీనివాసన్ కోరినట్లు సమాచారం.