సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఇంట్లో మరో విషాదం: అంత్యక్రియలు ముగిసిన కొన్ని గంటల్లోనే..
పాట్నా: ఆత్మహత్య చేసుకున్న బాలీవుడ్ స్టార్ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఇంట్లో మరో విషాదకర ఘటన చోటు చేసుకుంది. మరో కుటుంబ సభ్యురాలిని ఆ కుటుంబం కోల్పోయింది. సుశాంత్ సింగ్ భౌతికకాయానికి అంత్యక్రియలు ముగిసిన కొన్ని గంటల వ్యవధిలోనే సుశాంత్ సింగ్ వదిన మరణించారు. టీవీలో అంత్యక్రియలను చూస్తూ కన్నీటి పర్యంతం అయ్యారని, ఫలితంగా షాక్కు గురయ్యారని కుటుంబ సభ్యులు తెలిపారు. అంత్యక్రియలు ముగిసిన కొద్ది సేపటికి అనారోగ్యానికి గురై, కుప్పకూలిపోయారని చెప్పారు.
Recommended Video
ఏపీ చరిత్రలో తొలిసారిగా: ఈ సారి బడ్జెట్ సమావేశాల్లో అదే హైలైట్..ఎన్నో స్పెషాలిటీస్
బిహార్లోని పుర్నియా జిల్లా లాల్ మల్డీహా గ్రామంలో సోమవారం అర్ధరాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. సుశాంత్ సింగ్ తండ్రి కృష్ణ కుమార్ సింగ్ స్వగ్రామం ఇది. కృష్ణ కుమార్ సింగ్ కుటుంబం పాట్నాలో స్థిరపడింది. కృష్ణ కుమార్ సింగ్కు ఒక సుశాంత్ సింగ్, నలుగురు ఆడపిల్లలు. ఆయన సోదరుడు లాల్ మల్డీహా గ్రామంలోనే నివసిస్తున్నారు. సుశాంత్ సింగ్ భౌతికకాయానికి ముంబై విల్లేపార్లెలోని పవన్ హన్స్ శ్మశాన వాటికలో అంత్యక్రియలను నిర్వహిస్తోన్న దృశ్యాలను వారంతా టీవీలో తిలకించారు. వాటిని చూస్తూ తీవ్ర భావోద్వేగానికి, పెను విషాదానికి లోనయ్యారు.
సోమవారం రాత్రి ఇంట్లో ఎవరూ భోజనం కూడా చేయలేదు. ఫలితంగా సుశాంత్ సింగ్ కజిన్ భార్య సుధాదేవి అనారోగ్యానికి గురయ్యారు. సుశాంత్ సింగ్ ఆత్మహత్య చేసుకున్నప్పటి నుంచీ తిండీ, నిద్ర మానేశారని, ఫలితంగా సుధాదేవి అనారోగ్యానికి గురయ్యారని చెప్పారు. సోమవారం అర్ధరాత్రి లోబీపీతో బాధపడ్డారని, శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడ్డారని చెప్పారు. అదే సమయంలో గుండెపోటు రావడంతో మరణించినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు.
కాగా- సుశాంత్ సింగ్ ఆత్మహత్య ఘటనపై సమగ్ర దర్యాప్తు చేయిస్తామని మహారాష్ట్ర హోం శాఖ మంత్రి దేశ్ముఖ్ తెలిపారు. ఆత్మహత్య చేసుకోవడానికి పురిగొల్పిన ఘటనలపై ఆరా తీస్తామని అన్నారు. ఈ దిశగా ఇప్పటికే కొంత సమాచారాన్ని సేకరించామని చెప్పారు. ఆయన మీద ఎవరైనా ఉద్దేశపూరకంగా మానసిక ఒత్తిడిని తీసుకొచ్చారా? అనే కోణంలో దర్యాప్తు చేపడతామని అన్నారు. దీనిపై ఓ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయాలని ముంబై పోలీసులను ఆదేశించినట్లు దేశ్ముఖ్ తెలిపారు.