యూపీలో మరో దారుణం, యువతిపై లైంగికదాడి, కిరోసిన్ పోయడంతో 95 శాతం గాయాలు, ప్రియాంక ఫైర్..
ఉన్నావ్ ఘటన కళ్లముందు కదలాడుతుంటే అలాంటి ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఉత్తర ప్రదేశ్లోనే లైంగికదాడుల కేసులు బయటపడుతున్నాయి. ఉన్నావ్లో బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్ సెంగార్ అండ్ కో యువతిపై లైంగికదాడి చేసి, రోడ్డు ప్రమాదం చేశారు. తర్వాత మరో ఘటన వెలుగులోకి వచ్చింది. నిందితులే కిరోసిన్ పోసి నిప్పంటించడంతో బాధితురాలు చనిపోయింది. ఈ ఘటనలు మరవకముందే ఫతేఫూర్ జిల్లాలో మరో అభాగ్యురాలి ఒంటికి నిప్పంటించాడు కీచక ప్రియుడు.
ఇరుగు-పొరుగు
ఫతేపూర్ జిల్లా హుస్సేన్గంజ్ పోలీసుస్టేషన్ పరిధిలో ఓ ఫ్యామిలీ ఉంటోంది. ఇంటిపక్కనే మరో కుటుంబం ఉంటుంది. వీరి మధ్య ఎలాంటి విభేదాలు లేవు. కానీ ఇరుగు పొరుగు ఉండే యువతి, యువకుడు ప్రేమించుకుంటున్నారు. విషయం ఇంట్లో కూడా తెలిసింది. శనివారం యువతి ఇంట్లో పంచాయతీ పెట్టారు. వీరి పెళ్లి చేసేందుకు కుటుంబసభ్యులు అంగీకరించలేదు. దీంతో గొడవ జరిగి.. యువతి కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకునే వరకు వెళ్లింది.
పంచాయితీలో..
పంచాయితీలో తమ పెళ్లి చేయరని యువతి అక్కడినుంచి వెళ్లిపోయిందని తెలుస్తోంది. గదిలోకి వెళ్లి ఆత్మహత్య చేసుకుందని వాదన కూడా వినిపిస్తోంది. కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకొని ఉంటుందనే కూడా కొందరు అంటున్నారు. కానీ యువతి సోదరుడు మాత్రం పోలీసులకు జరిగిన ఘటన గురించి ఫిర్యాదు చేశారు. దీంతో ఏం జరిగిందనే అంశంపై పోలీసులకు స్పష్టత రాలేదు. ప్రియుడే నిప్పంటించాడనే అంశంపై విచారిస్తున్నామని.. దీంతోపాటు యువతి కూడా ఆత్మహత్య చేసుకునే అవకాశం ఉందని పోలీసు అధికారి చెప్తుండటం ప్రాధాన్యం సంతరించుకుంది.
ఇంట్లోకి వచ్చి, లైంగికదాడి..
తమ ఇంటి పక్కన ఉండే యువకుడు శనివారం ఉదయం ఇంట్లోకి వచ్చాడని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన సోదరిపై లైంగికదాడి చేశాడని పేర్కొన్నాడు. అయితే ఆమె ఎక్కడ కుటుంబసభ్యులు, పోలీసులకు ఫిర్యాదు చేస్తుందనే భయం మాత్రం ఉందని తెలిపాడు. ఎక్కడ తన పేరు బయటకొస్తుందని కిరోసిన్ పోసి నిప్పంటించాడని కంప్లైంట్ చేశాడు. బాధితురాలి సోదరుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్పీ ప్రశాంత్ వర్మ తెలిపారు. ప్రియుడిపై 376, 307 సెక్షన్ల కింద కేసు నమోదు చేశామన్నారు.
95 శాతం గాయాలు
మంటలు అంటుకున్న వెంటనే యువతిని సంచులతో ఆర్పివేశారు. వెంటనే జిల్లా ఆస్పత్రికి తరలించారు. అక్కడినుంచి మెరుగైన చికిత్స కోసం కాన్పూర్లోని ఎల్ఎల్ఆర్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. యువతి ఒళ్లంతా గాయపడ్డారని డాక్టర్ నరేశ్ విశాల్ తెలిపారు. ఆమె పాదాలకే గాయం కాలేదని వివరించారు. ఆమె పరిస్థితి అత్యంత విషమంగా ఉందని, 95 శాతం గాయాలయ్యాయని వెల్లడించారు. ఆస్పత్రిలో బాధితురాలి వాంగ్ములాన్ని తహశీల్దార్ తీసుకున్నారు. ఈ సమయంలో తనను కాపాడాలని, తనకు చనిపోవాలని లేదని చెప్పడం అక్కడున్న వారిని కలచివేసింది. బాధిత యువతికి సోదరుడు, కుటుంబసభ్యులు నచ్చజెప్పారు.
పరారీ
యువతిపై దాడి జరిగిన తర్వాత యువకుడు పారిపోయాడు. అతని కుటుంబసభ్యులు కూడా ఇంటికి తాళం వేసి వెళ్లిపోయారు. దీంతో సమీప గ్రామాల్లోని వారి బంధువుల ఇళ్లల్లో కూడా పోలీసులు సోదాలు నిర్వహించారు. యువకుడి కోసం గాలింపు ముమ్మరం చేస్తున్నామని పోలీసు అధికారులు వెల్లడించారు.
ప్రియాంక ఫైర్
ఫతేపూర్ ఘటనను కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఖండించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని చెప్పడానికి వరసగా జరుగుతున్న ఘటనలే కారణమని చెప్పారు. మృగాళ్లు రెచ్చిపోతున్న యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఏం చేస్తుందని, నేరాలు జరగకుండా ఎందుకు అడ్డుకట్ట వేయలేకపోతుందని ప్రశ్నించారు