వాట్సాప్ పుకారు: మధ్య ప్రదేశ్లో మహిళను దారుణంగా కొట్టి చంపారు
మధ్య ప్రదేశ్ : వాట్సాప్ రూమర్లు మరో ప్రాణాన్ని తీశాయి. ప్రభుత్వాలు పుకార్లను నమ్మొద్దంటూ విస్తృత స్థాయిలో ప్రచారాలు నిర్వహిస్తున్నప్పటికీ... ప్రజల్లో మాత్రం మార్పు రావడం లేదు. ఒక కొత్త వ్యక్తి తమ ప్రాంతంలో కనపడితే చాలు.. చితకబాది ప్రాణాలు తీసేస్తున్నారు. తాజాగా మధ్యప్రదేశ్ రాష్ట్రం సింగ్రౌలీ జిల్లాలో మరో సామూహిక దాడి జరిగింది. అయితే ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయింది ఓ మహిళ.
సింగ్రౌలి జిల్లాలోని ఓ గ్రామంలో 25 ఏళ్ల మహిళ ప్రత్యక్షమైంది. గ్రామంలో కొత్తగా కనపడటంతో గ్రామస్తులు ఆమెను ప్రశ్నించారు. అనంతరం చిన్నపిల్లలను కిడ్నాప్ చేసేందుకే వచ్చిందని భావించిన గ్రామస్తులు ఆమెను చితకబాదటంతో అక్కడికక్కడే మహిళ మృతి చెందిందని జిల్లా ఎస్పీ రియాజ్ ఇక్బాల్ చెప్పారు. సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లే ఈ హత్యకు దారి తీసి ఉంటాయని ఎస్పీ వివరించారు. అటవీశాఖకు సంబంధించిన ఓ నర్సరీ దగ్గర మహిళ మృతదేహం కనుగొన్నట్లు ఎస్పీ తెలిపారు. ఈ ఘటనలో 12 మంది అనుమానితులను అరెస్టు చేసినట్లు చెప్పారు. మిగతా వారికోసం గాలిస్తున్నట్లు తెలిపారు. అయితే మృతురాలకు సంబంధించిన వివరాలను గుర్తించే పనిలో ఉన్నట్లు ఆయన తెలిపారు. ఘటన ఉత్తర్ ప్రదేశ్కు సరిహద్దులో జరిగిందని చెప్పారు.
ఇప్పటికే సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లపై నజర్ పెట్టిన పోలీసులు... అన్ని రకాలుగా వీటిపై అవగాహన తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. జూన్ 18న బాలాఘాట్లో ఇద్దరి వ్యక్తులపై సామూహిక దాడి జరిగిందని చెప్పిన పోలీసులు ఆ తర్వాత వారానికే ఓ ప్రభుత్వ ఉద్యోగి, ఓ నృత్యకళాకారిణిపై కూడా దాడులు జరిగాయని అయితే పోలీసులు సరైన సమయంలో అక్కడకు చేరుకుని వారి ప్రాణాలను కాపాడగలిగారని ఎస్పీ చెప్పారు. ఈ ఘటనలు జరిగిన నాలుగు రోజులకే మరో ఫారెస్టు అధికారిణిపై కూడా దాడి జరిగిందని అయితే ఆమె గాయాలతో బయటపడిందని చెప్పిన ఎస్పీ తాజా ఘటనలో మాత్రం మహిళను కాపాడలేకపోయామని చెప్పుకొచ్చారు.