ప్రధాని రేసులో ఉన్నారా అంటే చంద్రబాబు ఏం చెప్పారంటే? స్టాలిన్తో గంటపాటు భేటీ
Recommended Video
చెన్నై/అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం సాయంత్రం డీఎంకే అధినేత స్టాలిన్, ఆ పార్టీ నేతలు కనిమొళి, ఏ రాజా తదితరులతో భేటీ అయ్యారు. గురువారం బెంగళూరు వెళ్లి జేడీఎస్ అధినేత, మాజీ ప్రధాని దేవేగౌడ, కర్ణాటక సీఎం కుమారస్వామితో భేటీ అయ్యారు.
స్టాలిన్ వద్దకు ఏపీ సీఎం, రాహుల్ గాంధీ దూతగా రేపు చంద్రబాబు వద్దకు అశోక్ గెహ్లాట్
Andhra Pradesh CM N Chandrababu Naidu meets DMK President MK Stalin at his residence in Chennai. pic.twitter.com/WCemVqPcKt
— ANI (@ANI) November 9, 2018
శుక్రవారం చెన్నైలో డీఎంకే నేతలతో సమావేశమయ్యారు. జాతీయస్థాయిలో ప్రధాని నరేంద్ర మోడీ, బీజేపీకి వ్యతిరేకంగా పలు పార్టీల జాతీయ నాయకులను కలిసి వారిని, ఏకతాటి పైకి తెచ్చేందుకు చంద్రబాబు కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగా ఆయన డీఎంకే నేతలను కలిశారు.
గంటసేపు స్టాలిన్తో చర్చలు
గన్నవరం విమానాశ్రయం నుంచి చెన్నై బయల్దేరిన చంద్రబాబు చెన్నైలో దిగి నేరుగా స్టాలిన్ ఇంటికి వెళ్లారు. చంద్రబాబుకు డీఎంకే నేతలు ఘనస్వాగతం పలికారు. చంద్రబాబు వెంట యనమల రామకృష్ణుడు, కళా వెంకట్రావు, నక్కా ఆనంద్ బాబు, ఎంపీ సీఎం రమేశ్, కనకమేడల రవీంద్ర కుమార్, కంభంపాటి రామ్మోహన్ రావు తదితరులు ఉన్నారు. భేటీ అనంతరం చంద్రబాబు, స్టాలిన్లు మీడియాతో మాట్లాడారు. ఇరువురు నేతలు సుమారు గంటసేపు చర్చలు జరిపారు.
కలిసి రావాలని స్టాలిన్ను కోరా
మోడీ పాలనలో దేశ ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని చంద్రబాబు చెప్పారు. అందుకే దానిని రక్షించేందుకు కలిసి రావాలని స్టాలిన్ను కోరానని, ఆయన అంగీకరించారని చెప్పారు. బీజేపీయేతర కూటమి ఏర్పాటుపై స్టాలిన్తో పాటు ఆ పార్టీ ముఖ్యనేతలతో చర్చించినట్లు తెలిపారు. దేశంలోని వ్యవస్థలను బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందన్నారు. సీబీఐ లాంటి రాజ్యాంగబద్ధ సంస్థలను భ్రష్టు పట్టించారన్నారు. ఆర్బీఐ గవర్నర్ సైతం తప్పుకునేందుకు సిద్ధమయ్యే పరిస్థితి వచ్చిందన్నారు.
నేను ప్రధాని పదవి రేసులో లేను
కాంగ్రెస్తో తమకు దాదాపు నలభై ఏళ్ల వైరుద్యం ఉందని, దేశం కోసం వాటిని పక్కనపెట్టి రాహుల్ గాంధీతో కలిసి పని చేస్తామని చంద్రబాబు చెప్పారు. బీజేపీ పాలనలో దేశంలో అసహనం పెరిగిపోయిందన్నారు. దేశంలో ఎవరికీ మేలు జరగలేదన్నారు. తమిళనాడులో ప్రభుత్వం లేదని, ఢిల్లీ నుంచి రిమోట్ కంట్రోల్తో పాలన కొనసాగుతోందన్నారు. బీజేపీయేతర పార్టీలు ఏకతాటి పైకి వచ్చేందుకు అందరితో చర్చిస్తున్నామన్నారు. తాను ప్రధానమంత్రి రేసులో ఉండనని మీడియా అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా చంద్రబాబు చెప్పారు.
చంద్రబాబు చెప్పారని స్టాలిన్
బీజేపీకి వ్యతిరేకంగా కూటమి ఆవశ్యకతను చంద్రబాబు వివరించాలని స్టాలిన్ తెలిపారు. ఆ కూటమిలో చేరేందుకు తాము సిద్ధమని చెప్పారు. చర్చలు జరుగుతున్నాయన్నారు. అన్ని వ్యవస్థలను కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని మండిపడ్డారు. తమ పార్టీ కూడా బీజేపీకి వ్యతిరేకంగా గళం ఎత్తిందన్నారు.