కోల్కతాకు ప్రధాని మోడీ: భారీ నిరసనలకు కాంగ్రెస్, వామపక్షాలు, టీఎంసీ ప్లాన్, భద్రత కట్టుదిట్టం
కోల్కతా: ప్రధాని నరేంద్ర మోడీ రెండు రోజుల పర్యటన నిమిత్తం పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో పర్యటిస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్, వామపక్షాలు, టీఎంసీ సహా పలు పార్టీలు పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ), ఎన్ఆర్సీలకు వ్యతిరేకంగా భారీ ఎత్తున నిరసనలు చేపట్టేందుకు సిద్ధమయ్యాయి. మోడీ సభలో నల్లజెండాలతో నిరసన తెలుపుతామంటూ వామపక్షాల అనుబంధ సంస్థలు ఇప్పటికే ప్రకటించాయి.
ప్రధాని రెండ్రోజల పర్యటన
రెండ్రోజుల పర్యటనలో భాగంగా శనివారం (జనవరి 11న) సాయంత్రం ప్రధాని నరేంద్ర మోడీ కోల్కతాకు చేరుకుంటారు. ప్రోటోకాల్ ప్రకారం ఆయన రాజ్భవన్లో బస చేస్తారు. కాగా, ప్రధాని మోడీ పర్యటన నేపథ్యంలో పోలీసులు కోల్కతాలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు.
వాయుసేన విమానంలో కోల్కతాకు ప్రధాని
కోల్కతా విమానాశ్రయంలోనూ భద్రతా చర్యలు చేపట్టారు. భారతీయ వాయుసేన విమానంలో శనివారం సాయంత్రం 4గంటలకు ప్రధాని మోడీ కోల్కతా చేరుకోనున్నారు. ఆ తర్వాత ఆయన ప్రత్యేక విమానంలో సిటీని వీక్షించనున్నారు. అనంతరం ఆయన సిటీ రెస్ కోర్సుకు బయల్దేరతారు. ఓల్డ్ కరెన్సీ బిల్డింగ్లో జరిగే అధికారిక కార్యక్రమంలో ప్రధాని మోడీ పాల్గొంటారు.
ముస్లిం సంఘాలతోపాటు కాంగ్రెస్, వామపక్షాలు, టీఎంసీ నిరసనలు
పలు ముస్లిం సంఘాలు కూడా సీఏఏ, ఎన్ఆర్సీ వ్యతిరేకంగా రాజ్ భవన్ రోడ్లో శనివారం మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో ఆందోళన చేపట్టాలని నిర్ణయించాయి. కాంగ్రెస్, వామపక్షాలు నల్ల జెండాలతో నగర వ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు చేపట్టాయి. పశ్చిమబెంగాల్ సీఎం మమత బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కూడా దక్షిణ కోల్కతా నగరంలో మానవ హారాలతో సీఏఏ, ఎన్ఆర్సీలకు వ్యతిరేకంగా నిరసనలు తెలుపుతామని పేర్కొంది.
ఢిల్లీలో సోనియా కీలక సమావేశం..
ఇది ఇలావుంటే, న్యూఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ తదితర నేతలు కీలక సమావేశం నిర్వహిస్తున్నారు. సీఏఏ, ఎన్ఆర్సీ, జేఎన్యూతోపాటు యూనివర్సిటీలలో జరుగుతున్న దాడులపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. ముంబై కాంగ్రెస్ పార్టీ కూడా సీఏఏ, ఎన్ఆర్సీ, ఎన్పీఆర్లకు వ్యతిరేకంగా భారీ ఎత్తున నిరసనలు చేపట్టేందుకు సిద్ధమవుతోంది. హైదరాబాద్లో శుక్రవారం ఎంఐఎం ఆధ్వర్యంలో సీఏఏ, ఎన్ఆర్సీలకు వ్యతిరేకంగా భారీ ర్యాలీ జరిగిన విషయం తెలిసిందే. కాగా, ఇప్పటికే కేంద్ర హోంమంత్రి అమిత్ షా పౌరసత్వ సవరణ చట్టం జనవరి 10 నుంచి అమల్లోకి వస్తుందని గెజిట్ విడుదల చేసిన విషయం తెలిసిందే.